Today in Parliament : పెరుగుతున్న ధరలపై చర్చ - రాజ్యసభ సభ్యుల సస్పెన్షన్ పై రాజీ ఫార్ములా..!!
పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా ఈ రోజున ఉభయ సభల్లోనూ కీలక నిర్ణయాలు జరగనున్నాయి. ఈ రోజు బిజినెస్ లో భాగంగా లోక్ సభలో ప్రశ్నోత్తరాల తరువాత పలువురు కేంద్ర మంత్రులు తమ శాఖలకు సంబంధించిన కీలక పేపర్లను సభ ముందు ఉంచనున్నారు. పార్లమెంట్ స్టాండింగ్ కమిటీలు సిద్దం చేసిన నివేదికలను సభకు సమర్పించనున్నారు. ఇక, ఓమిక్రాన్ పైన కేంద్రం ప్రకటన చేసే అవకాశం ఉంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఓమిక్రాన్ కేసులు వెలుగులోకి వచ్చాయి.
దీంతో పాటుగా కేంద్ర మంత్రులు తమ శాఖలకు సంబంధించిన అంశాల పైన ప్రకటనలు చేయనున్నారు. ప్రస్తుత ఆర్దిక సంవత్సరానికి సంబంధించి ద్రవ్య వినిమియ బిల్లు -5 ను కేంద్ర ఆర్దిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ సభలో ప్రవేశ పెట్టనున్నారు. ధరల పెరుగుదల పైన కాంగ్రెస్ పార్టీ లోక్ సభ విపక్ష నేత అధిర్ రంజన్ చౌదురి చర్చ ప్రారంభించనున్నారు. ఇక, రాజ్యసభలో సభ్యుల సస్పెన్షన్ పైన కొనసాగుతన్న ప్రతిష్ఠంబన పైన ఈ రోజు పరిష్కారం లభించే అవకాశం ఉంది.

సమావేశాలు ప్రారంభమైన రోజున గత సమావేశాల్లో సభ్యుల అనుచిత ప్రవర్తన కారణంగా 12 మంది సభ్యులను సస్పెండ్ చేస్తూ ఛైర్మన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ సస్పెన్షన్ ఎత్తివేయాలని రాజ్యసభలో విపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు. క్షమాపణ చెబితేనే సస్పెన్షన్ ఎత్తివేస్తామని ఛైర్మన్ స్పష్టం చేసారు. దీంతో..ఈ అంశం తో సహా అనుసరించాల్సిన వైఖరిపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మంగళవారం ఢిల్లీలోని తన నివాసంలో ప్రతిపక్షాలతో ఓ కీలక సమావేశం నిర్వహించారు.
కాంగ్రెస్ ఎంపీలు రాహుల్ గాంధీ,మల్లిఖార్జున ఖర్గే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, శివసేన ఎంపీ రౌత్, డీఎంకే ఎంపీ టీఆర్ బాలు, సీపీఎం నేత సీతారాం ఏచూరీ, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా ఈ సమావేవానికి హాజరైన వారిలో ఉన్నారు. రాజ్యసభ సభ్యుల సస్పెన్షన్ విషయంలో చైర్మన్ వెంకయ్యనాయుడు దగ్గరికి ఎన్సీపీ అధినేత శరద్ పవార్ను పంపాలని, ఈ విషయంపై ఓ పరిష్కార మార్గం కనుగొనాలని సోనియా గాంధీ ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications