Today in Parliament: కంప్లీట్ షెడ్యూల్ ఇదే: ఆ విషయంలో మోడీ సర్కార్ వెనక్కి తగ్గినట్టే
న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఈ ఉదయం ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 23వ తేదీ వరకు కొనసాగుతాయి. తొలి రోజే కేంద్ర ప్రభుత్వం పలు బిల్లులను సభలో ప్రవేశపెట్టనుంది. మోడీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించిన మూడు వ్యవసాయ చట్టాల రద్దు బిల్లు కూడా ఉంది. మొత్తంగా 26 బిల్లులు శీతకాల పార్లమెంట్ సమావేశాల సందర్భంగా సభ ముందుకు రానున్నాయి. క్రిప్టోకరెన్సీ కార్యకలాపాలను రద్దు చేయడానికి ఉద్దేశించిన బిల్లు కూడా ఇవ్వాళే టేబుల్ అవుతుంది.
తొలుత- కొత్తగా లోక్సభకు ఎన్నికైన ఇద్దరు సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తారు. కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ ఎంపీలు ప్రతిభా సింగ్, జ్ఞానేశ్వర్ పాటిల్ కొత్తగా లోక్సభకు ఎన్నికయ్యారు. ఇటీవల నిర్వహించిన ఉప ఎన్నికల్లో వారు ఘన విజయం సాధించారు. హిమాచల్ ప్రదేశ్లోని మండీ నియోజకవర్గానికి నిర్వహించిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ప్రతిభాసింగ్ విజయం సాధించారు. తన ప్రత్యర్థి, బీజేపీకి చెందిన అభ్యర్థిని మట్టి కరిపించారు.
మధ్యప్రదేశ్లోని ఖండ్వా స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన జ్ఞానేశ్వర్ పాటిల్ గెలుపొందారు. వారిద్దరూ ఇవ్వాళ ప్రమాణ స్వీకారం చేస్తారు. అనంతరం సభ- ఈ మధ్యకాలంలో కన్నుమూసిన కేంద్ర మాజీమంత్రులు, మాజీ సభ్యులకు నివాళి అర్పిస్తుంది. బీ సెంగుట్టువాన్, కల్యాణ్ సింగ్, ఆస్కార్ ఫెర్నాండెజ్, గోడిల్ ప్రసాద్ అనురాగి, శ్యామ్ సుందర్ సొమాని, రాజ్ నారాయణ్ బధోలియా, దేవ్వ్రత్ సింగ్, హరి దాన్వే పుండలిక్లకు సభ నివాళి అర్పిస్తుంది.
అనంతరం కేంద్రమంత్రులు పర్యావరణం, అటవీ శాఖ తరఫున అశ్విని కుమార్ చౌబె, పార్లమెంట్ వ్యవహారాల శాఖ నుంచి అర్జున్ రామ్ మేఘ్వాల్, ఆర్థిక మంత్రిత్వ శాఖ తరఫున పంకజ్ చౌధరి కొన్ని ప్రతిపాదనలను టేబుల్ చేస్తారు. సాంస్కృతిక వ్యవహారాల శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖి, విద్యాశాఖ సహాయ మంత్రి అన్నపూర్ణ దేవి, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ సహాయ మంత్రి బీఎల్ వర్మ, మానవ వనరుల శాఖ సహాయమంత్రి డాక్టర్ సుభాష్ సర్కార్ తమ శాఖలకు చెందిన ప్రతిపాదనలను సభ సమక్షంలో ఉంచుతారు.
Recommended Video
దీని తరువాత బిల్లులను ప్రవేశపెట్టడం మొదలవుతుంది. మూడు వ్యవసాయ చట్టాల ఉపసంహరణకు సంబంధించిన ది ఫార్మ్ లాస్ రిపీల్ బిల్-2021ను వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, ది అసిస్టెడ్ రీప్రొడక్టివిటీ టెక్నాలజీ (రెగ్యులేషన్ బిల్లు)-2020ను డాక్టర్ మన్సుఖ్ భాయ్ మాండవీయ సభ ముందుకు తీసుకొస్తారు. దీనిపై చర్చ కొనసాగుతుంది. అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య కొంతసేపు డిబేట్ సాగుతుంది. మూడు వ్యవసాయ చట్టాలను ఎందుకు ఉపసంహరించుకోవాల్సి వచ్చిందనే విషయంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇస్తుంది. దీనితోపాటు- క్రిప్టోకరెన్సీ వ్యవహారాలను నిషేధిస్తూ రూపొందించిన బిల్లు టేబుల్ అవుతుంది.