Today in Parliament : కోవిడ్ -19 పై లోక్ సభలో చర్చ - రైతు బిల్లుల రద్దుకు రాష్ట్రపతి ఆమోదం..!!
పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఈ రోజున నాలుగో రోజు పలు కీలక అంశాల పైన సభలో చర్చ జరగనుంది. పలువురు మంత్రులు తమ శాఖలను సంబంధించిన నివేదికలను సభకు సమర్పించనున్నారు. ఇప్పటికే రైతు చట్టాలను వెనక్కు తీసుకున్న ప్రభుత్వం ప్రతిపక్షాల ఆందోళన నడుమ రెండు సభల్లోనూ ఆ బిల్లులను ఉప సంహరించుకుంటూ ప్రవేశ పెట్టిన బిల్లులను ఆమోదింప చేసుకుంది. వీటిని రాష్ట్రపతికి పంపగా..ఆయన ఆమోదం సైతం లభించింది.
ఇక, రైతులు కోరుతున్న కనీస మద్దతు ధరతో సహా ఇతర డిమాండ్ల పైన రైతు సంఘాల ప్రతినిధులతో పాటుగా ప్రభుత్వం నుంచి సభ్యులతో కమిటీ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇక, రాజ్యసభలో 12 మంది సస్పెన్షన్ అంశం పైన ప్రతిపక్ష పార్టీలు ఛైర్మన్ పైన ఒత్తిడి చేస్తున్నాయి. కానీ, ఛైర్మన్ మాత్రం సస్పెన్షన్ అంశంలో పునరాలోచన లేదని తేల్చి చెబుతున్నారు. ఇక, ఈ రోజు సమావేశాల్లో భాగంగా లోక్ సభలో తొలుత ప్రశ్నోత్తరాలు చేపట్టనున్నారు. అనంతరం మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్, ప్రహ్లాద్ సింగ్ పటేల్ జలశక్తి శాఖకు సంబంధించిన పత్రాలను సభ ముందు ఉంచనున్నారు.
అదే విధంగా.. మంత్రులు వీకే సింగ్..కిషన్ పాల్.. భాను ప్రతాప్ సింగ్ వర్మ...రామేశ్వర్ తేలీ..కౌశల్ కిషోర్ సైతం తమ శాఖలకు సంబంధించిన అంశాలను సభ్యుల ముందు ఉంచనున్నారు. ఆ తరువాత బీసీ సంక్షేమం తో పాటుగా సంక్షేమ రంగం పైన పార్లమెంటరీ కమిటీలు సమర్పించిన నివేదికలను సభ ముందు ప్రజెంట్ చేయనున్నారు. ప్రభుత్వ రంగ పరిశ్రమల్లో బీసీలకు ప్రాధాన్యత పైన కమిటీల నివేదికల్లో పలు సూచనలు చేసారు. ఆ తరువాత ఖాయిలా పడిన ఎరువులు..రసాయన కర్మాగారాల అంశంలో పార్లమెంటరీ కమిటీ చేసిన సిఫార్సులను ప్రభుత్వం సభ ముందు ఉంచనుంది.
ఇక, ప్రభుత్వ బిల్లుల్లో భాగంగా ఆరోగ్య శాఖ మంత్రి మాండవీయ ది నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫార్మాసూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చె అమెండ్ మెంట్ బిల్లు 2021ను సభలో ఆమోదం కోసం ప్రవేశ పెట్టనున్నారు. ఇక, రూల్ 193 కింద సభలో దేశంలోని కోవిడ్ -19 పరిస్థితుల పైన సభలో చర్చ జరగనుంది. అటు, రాజ్యసభలోనూ పలు పార్లమెంటరీ కమిటీలు సభకు సమర్పించిన అంశాల పైన చర్చకు ప్రతిపాదించనన్నారు. ఇక, సభలో జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ద డామ్ సేఫ్టీ బిల్ 2019 ను ఆమోదం కోసం సభ ముందు ఉంచనున్నారు.