ఒకేసారి కన్ను తెరిచి-ఒకేరోజు కన్నుమూసి.. కరోనా కాటుకు బలైన కవల సోదరులు-తల్లిదండ్రులకు తీరని శోకం
జతగా పుట్టారు... జతగానే వెళ్లిపోయారు... కవల పిల్లలు జన్మించడంతో ఆ తల్లిదండ్రులు ఎంత సంతోషించారో... కరోనా ఆ ఇద్దరినీ ఒకేసారి కబళించడంతో అంతగా కుమిలిపోతున్నారు. ఉత్తరప్రదేశ్లోని మీరట్కి చెందిన కవలలు జోఫ్రెడ్ వర్గీస్ గ్రెగొరీ,రాల్ఫ్రెడ్ జార్జ్ గ్రెగొరీ కరోనా కాటుకు బలయ్యారు. ఇద్దరూ ఒకే రోజు కరోనా బారినపడ్డారు. చివరకు ఒకేరోజు కొన్ని గంటల తేడాతో మృత్యు ఒడిలోకి చేరారు. చిన్నతనం నుంచి ఏ పనైనా కలిసే చేసిన కవల సోదరులు ఇలా మృత్యువులోనూ ఒక్కటవడం ఆ తల్లిదండ్రులకు తీరని కడుపు శోకాన్ని మిగిల్చింది.
ఇద్దరూ ఒకే చదువు,ఒకచోటే జాబ్...
మీరట్కి చెందిన సోజా-గ్రెగొరీ రేమండ్ రాఫెల్ దంపతులకు ఏప్రిల్ 23,1997న జోఫ్రెడ్ వర్గీస్ గ్రెగొరీ,రాల్ఫ్రెడ్ జార్జ్ గ్రెగొరీ అనే కవలలు జన్మించారు. వృత్తిరీత్యా టీచర్లయిన దంపతులు పిల్లలను కష్టపడి చదివించారు. చదువు నుంచి కెరీర్ వరకు కవలలు ఇద్దరు కలిసే ముందుకు సాగారు. ఇద్దరూ కంప్యూటర్ ఇంజనీరింగ్ కోర్సే చదివారు. ఇద్దరూ ప్రస్తుతం హైదరాబాద్లోనే జాబ్ చేస్తున్నారు. అంతా సాఫీగా సాగిపోతున్న వేళ కరోనా వారి జీవితాలను చిధిమేసింది.
ఇద్దరికీ ఒకేరోజు కోవిడ్...
ఈ ఏడాది ఏప్రిల్ 24న ఇద్దరికీ జ్వరం వచ్చింది. సాధారణ జ్వరమే అనుకుని ఇంట్లోనే మందులు వాడారు. ఇదే క్రమంలో ఒకరోజు ఆక్సిమీటర్తో ఆక్సిజన్ లెవల్ను పరీక్షించగా ఇద్దరికీ 90 కంటే తక్కువగా ఉన్నట్లు చూపించింది. వైద్యుల సూచన మేరకు ఇద్దరినీ మే 1న ఆస్పత్రిలో చేర్పించారు. ఆ తర్వాత కోవిడ్ పరీక్షల్లో ఇద్దరికీ పాజిటివ్గా నిర్దారణ అయింది. అయితే కొద్దిరోజులకే సెకండ్ ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయగా నెగటివ్గా తేలింది.
ఒకేరోజు కన్నుమూసిన సోదరులు
కోవిడ్ రిపోర్ట్ నెగటివ్ రావడంతో ఇద్దరూ కోలుకుంటున్నారని తల్లిదండ్రులు భావించారు. వైద్యులు కూడా ఇద్దరినీ కోవిడ్ వార్డు నుంచి సాధారణ ఐసీయూకి మార్చే ఆలోచనలో ఉన్నట్లు మార్చి 14న చెప్పారు. అయితే ఎందుకైనా మంచిదని మరో రెండు రోజులు కోవిడ్ వార్డులోనే ఉంచి వారిని పర్యవేక్షించాలని తల్లిదండ్రులు వైద్యులను కోరారు. అదే రోజు సాయంత్రం ఆస్పత్రి నుంచి ఫోన్ వచ్చింది. ఇద్దరు కవలల్లో ఒకరైన రాల్ఫ్రెడ్ జార్జ్ గ్రెగొరీ చనిపోయినట్లు వైద్యులు సమాచారమిచ్చారు. ఆ తర్వాత కొద్ది గంటల తేడాతోనే మరో కుమారుడు జోఫ్రెడ్ వర్గీస్ గ్రెగొరీ కూడా చనిపోయాడు. దీంతో ఆ తల్లిదండ్రుల గుండె పగిలిపోయింది.
తీరని శోకం మిగిల్చి...
రాల్ఫ్రెడ్ జార్జ్ గ్రెగొరీ చనిపోయినట్లు సమాచారం వచ్చిన కాసేపటికి జోఫ్రెడ్ వర్గీస్ గ్రెగొరీ తమకు ఫోన్ చేశాడని తల్లిదండ్రులు చెప్పారు. తన సోదరుడు చనిపోయిన విషయం అప్పటికీ ఇంకా అతనికి తెలియదన్నారు. తాను కోలుకుంటున్నానని... సోదరుడి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని ఆరా తీసినట్లు చెప్పారు. ఒకే ఆస్పత్రిలోనే ఉన్నప్పటికీ ఇద్దరూ వేర్వేరు కోవిడ్ వార్డుల్లో ఉన్నట్లు చెప్పారు.
తాము కూడా రాల్ఫ్రెడ్ మృతి గురించి అతనికేమీ చెప్పలేదన్నారు. కానీ ఆ తర్వాత కొద్ది గంటలకే తను కూడా చనిపోయాడని చెప్పారు. 'జీవితంలో ఇంకా ఎంతో సాధించాలి... కొరియా,జర్మనీ వెళ్లాలి... మిమ్మల్ని ఇంకా బాగా చేసుకోవాలి...' అని ఇద్దరూ ఎప్పుడూ చెబుతుండేవాళ్లని ఆ తల్లిదండ్రులు గుర్తుచేసుకుంటున్నారు. ఒకేసారి ఈ లోకంలోకి వచ్చిన ఇద్దరూ ఒకేసారి లోకాన్ని వదిలి తీరాన్ని శోకాన్ని మిగిల్చారని ఆవేదన చెందుతున్నారు.