అమెరికా వైస్ ప్రెసిడెంట్ నువ్వే..: గెలుపును ముందే చెప్పిన కమలా హారీస్ మేనమామ
న్యూఢిల్లీ: అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన భారత సంతతికి చెందిన కమలా హారిస్ గెలుస్తున్నారని తాను ముందే చెప్పానని ఆమె మేనమామ గోపాలన్ బాలచంద్రన్ తెలిపారు. ఫలితాలకు ముందు రోజే నువ్వు గెలువబోతున్నాయని తాను ఆమెకు చెప్పినట్లు ఆయన వెల్లడించారు.
ఢిల్లీలో స్థిరపడిన బాలచంద్రన్.. కమలా హారిస్ విజయం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. జో బైడెన్- కమలా హారీస్ల విజయాన్నే తామందరం కోరుకున్నామని తెలిపారు. కమలతో ఫలితాలకు ఒక రోజు ముందు మాట్లాడినట్లు తెలిపిన బాలచంద్రన్.. 'నువ్వు విజయం సాధించబోతున్నావ్' అని ఆమెకు చెప్పినట్లు వెల్లడించారు. ఇది చారిత్రాత్మక విజయమని ఆయన అభివర్ణించారు. భారతీయులను గర్వపడేలా చేశారని కొనియాడారు.
ఎంతో ఉత్కంఠగా సాగిన అమెరికా ఎన్నికలకు ఆదివారం తెరపడిన విషయం తెలిసిందే. అమెరికా 46వ అధ్యక్షుడిగా డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ భారీ విజయం సాధించారు. ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హారీస్ ఆ పదవి చేపట్టిన తొలి మహిళగా రికార్డు సృష్టించారు. ఈ పదవి చేపట్టిన ఆసియన్-అమెరికన్ కూడా కమలనే కావడం విశేషం.

కమలా హారీస్ విజయం పట్ల అమెరికాతోపాటు భారతదేశంలోని ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. కమలా హారీస్ పూర్వీకులు తమిళనాడుకు చెందినవారే కావడం గమనార్హం. కమలా హారీస్ తన తల్లితోపాటు అమెరికాకు వెళ్లి, అక్కడే స్థిరపడి అంచెలంచెలుగా ఎదుగుతూ ఇప్పుడు ఏకంగా ఆ దేశ ఉపాధ్యక్షురాలిగా నిలిచారు. తమపై ఉన్న విశ్వాసాన్ని తాము నిలబెట్టుకుంటామని జో బైడెన్ తో కలిసి కమలా హారీస్ స్పష్టం చేశారు.
కాగా, రెండోసారి అమెరికా అధ్యక్షుడు కావాలనుకున్న డొనాల్డ్ ట్రంప్ ఆశలు అడియాశలయ్యాయి. కరోనా మహమ్మారిని తగిన రీతిలో కట్టడి చేయచేలెకపోయారనే విమర్శలు ఎదుర్కొంటున్న ట్రంప్.. చివరకు అధికారాన్ని కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.












Click it and Unblock the Notifications