ముంబైకి వెళ్లే వాహనాలకు గుడ్ న్యూస్-ఎన్నికల వేళ బంపర్ ఆఫర్..!
మహారాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు సమీపిస్తున్న వేళ వరుసగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇదే క్రమంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందు మరో కీలక నిర్ణయం ప్రకటించింది. ముఖ్యంగా ముంబైలోకి ప్రవేశించే వాహనాలకు వర్తించేలా టోల్ ఫీజును మినహాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇవాళ్టి నుంచే ఈ నిర్ణయం అమల్లోకి రాబోతోంది. దీంతో ఇతర రాష్ట్రాలతో పాటు మహారాష్ట్రలోని ఇతర నగరాలు, ప్రాంతాల నుంచి ముంబైకి వెళ్లే వారికి ఇది ప్రయోజనం చేకూర్చబోతోంది.
ముంబైలోకి ప్రవేశించే లైట్ మోటార్ వాహనాలు అంటే ప్రధానంగా కార్లకు టోల్ ఫీజును మినహాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బస్సులు, లారీలు, ట్రక్కులకు మాత్రం ఈ నిర్ణయం వర్తించదు. ముంబై నగరంలోకి ప్రవేశించేందుకు మొత్తం 5 టోల్ బూత్ లు ఉన్నాయి. వీటిలో నుంచి నగరంలోకి ప్రవేశించే లైట్ మోటార్ వాహనాలకు ఈ నిర్ణయం వర్తించబోతోంది. ఇవాళ అర్ధరాత్రి 12 గంటల నుంచి నగరంలోకి వచ్చే వాహనాలకు దీన్ని వర్తింపచేస్తారు.

మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసేందుకు ఈసీ సిద్ధమవుతోంది. ఇవాళ లేదా రేపట్లో షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని కార్లు, ఇతర చిన్న వాహనదారులు స్వాగతిస్తున్నారు. రాష్ట్రంలో వచ్చే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి. ఇందులో అధికార మహాయుతి కూటమితో విపక్ష మహావికాస్ అఘాడీ కూటమి హోరాహోరీ తలపడుతోంది. ఇప్పటికే లోక్ సభ ఎన్నికల్లో విపక్షాలు పైచేయి సాధించిన నేపథ్యంలో ప్రభుత్వం ప్రజల్ని ఆకట్టుకునేందుకు అష్టకష్టాలు పడుతోంది.












Click it and Unblock the Notifications