మే 7వరకు నీతు అగర్వాల్ జైల్లో: పెదవి విప్పితే, ఆశ్రయం ఎవరిచ్చారు?
కర్నూలు: ఎర్ర చందనం స్మగ్లింగ్ కేసులో అరెస్టైన ప్రేమ ప్రయాణం చిత్ర కథానాయిక నీతు అగర్వాల్ అలియాస్ వినీత అగర్వాల్ అలియాస్ సీమను ఆదివారం కర్నూలు జిల్లా పోలీసులు అరెస్టు చేసి జడ్జి ముందు హాజరు పరిచారు. ఆమెకు మే 7వ తేదీ వరకు కోర్టు జ్యూడిషియల్ కస్టడీ విధించింది. ఆమె మారుతీ సుజికి కారులో బెంగళూరు పారిపోతుండగా కర్నూలు జిల్లా ఉలిందకొండ క్రాస్ రోడ్డు వద్ద అదుపులోకి తీసుకున్నారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, ఎర్ర చందనం స్మగ్లింగ్లో అరెస్టైన మస్తాన్ వలీ స్మగ్లింగ్తో సంబంధాలు ఉన్నాయని తేలడంతో ఆమె పైన రుద్రవరం పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. ఇందులో నీతును పదో నిందితురాలిగా ఉన్నట్లు వెల్లడించారు. ఆమె బ్యాంకు ఖాతాల నుండి ఆళ్లగడ్డ మండలం అహోబిలం ప్రాంతానికి చెందిన స్మగ్లరలకు నిధులు బదలీ అయినట్లు దర్యాఫ్తులో గుర్తించినట్లు చెప్పారు.
నీతును కోవెలకుంట్ల జూనియర్ సివిల్ న్యాయమూర్తి ముందు హాజరు పరిచారు. మే 7వ తేదీ వరకు జ్యూడిషియల్ కస్టడీ విధించారు. పోలీసులు ఆమెను నంద్యాల సబ్ జైలుకు తరలించారు. విచారించేందుకు రెండు మూడు రోజుల్లో పోలీసులు ఆమె కస్టడీని కోరే అవకాశముంది. ఆమె పెదవి విప్పితే చాలా విషయాలు బయటకు వస్తాయని పోలీసులు భావిస్తున్నారు.
అరెస్టుకు ముందు, పోలీసుల ఎదుట లొంగిపోతానంటూ నీతు కర్నలు జిల్లాకు చెందిన ఓ సీనియర్ ప్రజాప్రతినిధి అనుచరుడికి ఫోన్ చేసినట్లుగా తెలుస్తోంది.
అతను వద్దని వారించారని తెలుస్తోంది. తనను 2013లో మస్తాన్ వలీ వివాహం ఆడాడని నీతు అగర్వాల్ చెప్పారు. ఇటీవల ఆయన తనను హింసించి, గాయపరిచారని చెప్పారు. కాగా, ఇంతకాలం ఆమెకు ఎవరు ఆశ్రయమిచ్చారనే కోణంలో పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు. మీడియా సమావేశంలో ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. నీతుకు చెందిన మూడు బ్యాంకు ఖాతాలను స్తంభింపచేసేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు.