రేపే ఢిల్లీ పోరు..! దేశ రాజధానిలో జెండా ఎగరేసేది ఎవరు..?
ఢిల్లీ/హైదరాబాద్ : సార్వత్రిక ఎన్నికలు చివరి అంకానికి చేరుకోబోతున్నాయి. ఇప్పటికే చాలా మంది నేతల భవితవ్యాలు ఈవీఎంలలో నిక్షిప్తమయ్యాయి. ఆరోవిడతగా ఆదివారం దేశవ్యాప్తంగా జరగబోయే పోలింగ్లో షీలాదీక్షిత్, మేనకాగాంధీ, గౌతమ్ గంభీర్ తదితర ముఖ్యనేతలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఆరోదశ ఎన్నికల్లో ఢిల్లీ లోని ఈశాన్య ఢిల్లీ లోక్సభ స్థానం పలువురి దృష్టిని ఆకర్షిస్తోంది. కులాల సమీకరణలకు, అనధికార గ్రూపులకు, వలసజీవులకు ఇదో అడ్డా. ఈ లోక్సభ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు ముగ్గురు నేతలు శాయ శక్తులా కృషి చేస్తున్నారు. ఒకరు ఢిల్లీని 15 ఏళ్ల పాటు ఏకచక్రాధిపత్యంగా ఏలిన వారయితే, మరొకరు రాష్ట్ర బీజేపి రధ సారథి. వీరిద్దరికీ ప్రత్యామ్నాయంగా ఆప్ కూడా పోటీకి సై అంది. ఈ త్రిముఖ పోటీలో అధికారం ఎవరి సొంతమవుతుందనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఢిల్లీ గల్లీలో ఎగిరే జెండా ఎవరిది? త్రిముఖ పోటీ తప్పదంటున్న స్థానికులు..!!
ఈశాన్య ఢిల్లీ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫును మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ బరిలోకి దిగారు. 1998, 2003, 2008 శాసనసభ ఎన్నికల్లో ఆమె వరుస విజయాలు సాధించి, మూడు సార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. అనంతరం అంతర్గత విభేదాలతో పార్టీలో సంక్షోభం ఏర్పడింది. షీలాదీక్షిత్ నాయకత్వాన్ని ప్రజలు విశ్వసించలేకపోయారు. ఫలితంగా 2013 ఎన్నికల్లో కాంగ్రెస్ పరాజయంపాలైంది. అంతేకాకుండా 2014 లోక్సభ ఎన్నికల్లో కనీసం ఖాతా కూడా తెరవలేకపోయింది. కానీ, తాజా ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి పూర్వవైభవాన్నిదక్కించుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. కాషాయ పార్టీ కూడా మరోసారి ఈ స్థానంలో జెండా ఎగరేయాలని భావిస్తోంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మనోజ్ తివారియే నేరుగా బరిలోకి దిగుతుండటమే దీనికి ఉదాహరణ. మరోవైపు రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఆప్ కూడా ఈ స్థానాన్ని అంతతేలిగ్గా తీసుకోవడం లేదు. ఆప్ దిల్లీ కన్వీనర్ దిలీప్ పాండేను తన అభ్యర్థిగా బరిలోకి దించుతోంది.
విజేతను నిర్ణయించేది వీరే..! ఈశాన్య ఢిల్లీ ముస్లింల ప్రభావం ఎక్కువ..!!
ఉత్తరప్రదేశ్లోని పూర్వాంచల్ నుంచి వలస వచ్చిన ఇక్కడ స్థిరపడిన పూర్వాంచలీస్, ముస్లిం సామాజిక వర్గాలతోపాటు బిహార్ వలసజీవుల ప్రభావం ఈ నియోజకవర్గంలో ఎక్కువగా ఉంటుంది. ఇక్కడి విజేతను ఈ మూడు సామాజిక వర్గాల వారే నిర్ణయిస్తారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈశాన్య దిల్లీ పరిధిలోని మొత్తం జనాభాలో 22 శాతం మంది ముస్లింలే. గతంలో వీరంతా కాంగ్రెస్కు మద్దతు పలికేవారు. కానీ, ప్రస్తుతం ఆప్వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. 2015 శాసనసభ ఎన్నికల్లో ఈ లోక్సభ నియోజకవర్గ పరిధిలోని 10 స్థానాల్లో ఆమ్ఆద్మీ పార్టీ 9 స్థానాలను కైవసం చేసుకుంది.
బరిలో బీజేపి మరోజ్ తివారి, కాంగ్రెస్..! ఆమ్ ఆద్మీ ఓ ప్రత్యామ్నాయమేనా..?
పూర్వాంచలీస్ ప్రాబల్యం కూడా ఇక్కడ ఎక్కువే. నియోజకవర్గంలో దాదాపు 30 శాతం మంది వీళ్లే. బీజేపి అభ్యర్థి మనోజ్ తివారీ ఈ వర్గానికి చెందినవారే. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఆప్ అభ్యర్థి ఆనంద్ శర్మపై లక్షకు పైచిలుకు ఓట్లతో మనోజ్ తివారీ విజయం సాధించారు. తమ ప్రాంతానికి చెందిన ముఖ్యనాయకులందరీనీ ఒకే తాటిపైకి తీసుకురావడం ద్వారా విజయానికి చేరువయ్యేలా పావులు కదుపుతున్నారు. నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధి కార్యక్రమాలతో పాటు కేంద్రంలో బీజేపి సాధించిన విజయాలను ప్రచార కార్యక్రమాల్లో ప్రస్తావించారు. ఈ నియోజవర్గంలో దళితులు, బ్రాహ్మణులు, వైశ్యులు కూడా చెప్పుకోదగ్గ సంఖ్యలోనే ఉన్నారు. వీరంతా ఆమ్ ఆద్మీపార్టీకి మద్దతు పలికే అవకాశాలున్నాయి. సంక్షేమ కార్యక్రమాలతోపాటు విద్య, ఆరోగ్యాభివృద్ధికి ఆప్ ప్రభుత్వం చేస్తున్న కృషిని వారంతా అభినందిస్తున్నారు.
బీజేపితో పాటు కాంగ్రెస్ కూడా మద్దత్తు దారులు..! మూడు పార్టీల ఫైట్ తప్పేలా లేదు..!!
ఈశాన్య దిల్లీలోని షహద్ర ప్రాంతంలో కోలీ సామాజిక వర్గానికి చెందిన 1500 కుటుంబాలు ఉంటాయి. వీళ్ల పూర్వీకులు చాలా ఏళ్ల క్రితం పాకిస్థాన్లోని సింధ్ ప్రాంతం నుంచి ఇక్కడికి వలస వచ్చేశారు. స్థానిక పరిశ్రమల్లో కార్మికులుగా పని చేసుకుంటూ జీవనం సాగించేవారు. వీరంతా బీజేపికి గట్టి మద్దతుదారులు. ఇతర పార్టీలతో గానీ, బీజేపి అభ్యర్థితో గానీ వీళ్లకు సంబంధం ఉండదు. వీళ్లకు తెలిసిందల్లా ఒక్కటే.. బీజేపి, ప్రధాని మోదీ. ‘మోదీ దేశాన్ని రక్షిస్తున్నారు.. మేము ఆయనకే ఓటేస్తాం' అంటూ గట్టిగా చెబుతున్నారు. త్రిముఖ పోటీ అనివార్యమైన ఈ లోక్సభ స్థానానికి మే 12న పోలింగ్ జరగనుంది.