జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వాన్ని రద్దు చేయాలి: సుబ్రమణ్యస్వామి డిమాండ్
న్యూఢిల్లీ: జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తీ మెహబూబాపై బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. సైన్యం పై కేసు నమోదు చేయడంపై సుబ్రమణ్య స్వామి మండిపడ్డారు.
జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి సైన్యంపై కేసు పెట్టడంపై సుబ్రమణ్యస్వామి మీడియాతో మాట్లాడారు. ఈ ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయం అర్ధం పర్ధం లేనిదిగా సుబ్రమణ్యస్వామి అభివర్ణించారు.
ఈ అంశంలో కేంద్రం వెంటనే జోక్యం చేసుకోని. తక్షణమే కేసు వెనక్కి తీసుకోకపోతే.. విచక్షణ అధికారాలను ఉపయోగించి ప్రభుత్వాన్ని రద్దు చేయాలని సుబ్రమణ్యస్వామి డిమాండ్ చేశారు.
మెహబూబా నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కేబినెట్ నుంచి బయటకు వచ్చేందుకు బీజేపీ నేతలు సిద్ధం కావటం కలకలం రేపింది. అయితే అధిష్ఠానం సూచనలతో వారు వెనక్కి తగ్గినట్లు సమాచారం.
దక్షిణ కశ్మీర్ షోపియాన్ జిల్లాలోని గోవాంపురాలో శనివారం సైనిక వాహన శ్రేణిపై దాదాపు 250 మందికి పైగా నిరసనకారులు రాళ్లు రువ్వారు. సైన్యం నుండి ఆయుధాలు లాక్కొనేందుకు ప్రయత్నించారు. దీంతో సైన్యం కాల్పులకు దిగింది.
ఈ ఘటనలో ఇద్దరు మరణించగా, మరో ఎనిమిది మంది గాయపడ్డారు. ఈ ఘటనపై పూర్తి నివేదిక సమర్పించమని రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ సైన్యాన్ని ఆదేశించారు. మరోవైపు కాల్పుల జరిపిన సైన్యంపై జమ్మూ కశ్మీర్ పోలీసులు కేసు నమోదుచేశారు.