దేశంలో ప్రజాస్వామ్యం ఎక్కువైంది.. సంస్కరణ అవసరం: నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్
న్యూఢిల్లీ: భారతదేశంలో ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉందని, కఠినమైన సంస్కరణలను అమలు చేయడం ఇక్కడ కష్టసాధ్యంగా మారిందని నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ వ్యాఖ్యానించారు. అయితే, చైనా వంటి దేశాలకు పోటీ ఇచ్చేందుకు మరిన్ని కఠిన సంస్కరణలు అవసరమని పేర్కొన్నారు.
సర్వరాజ్య మేగజైన్ నిర్వహించిన వర్చువల్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. మైనింగ్, బొగ్గు, కార్మిక, వ్యవసాయం సహా అన్ని రంగాల్లో కేంద్రం కఠిన సంస్కరణలను అమలు చేసిందని, ఆ తర్వాతి దశ సంస్కరణలను రాష్ట్రాలు ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని స్పస్టం చేశారు.
కఠినమైన సంస్కరణలు లేకుండా చైనా లాంటి దేశాలకు పోటీ ఇవ్వలేమని అమితాబ్ కాంత్ తెలిపారు. 10-12 రాష్ట్రాలు అధిక వృద్ధిరేటు సాధిస్తే.. భారత్లో వృద్ధి నమోదు చేయకపోవడంలో ఆశ్చర్యం ఉండదని అన్నారు. డిస్కంల ప్రైవేటీకరణ చేయాల్సిందిగా కేంద్రపాలిత ప్రాంతాలను కోరినట్లు తెలిపారు. డిస్కంల మధ్య పోటీ పెరిగి మరింత చౌకగా విద్యుత్ ను అందించాలన్నారు.
ప్రభుత్వం ఆత్మనిర్భర్ భారత్ నినాదంతో భారత కంపెనీల సత్తా బయటకు వస్తుందని అన్నారు. భారత్ తయార్ కేంద్రంగా ఎదిగేందుకు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సహకాల పథకం ఎంతో తోడ్పాటునందిస్తోందని అమితాబ్ కాంత్ వివరించారు.
వ్యవసాయ రంగానికి కూడా సంస్కరణలు అవసరమని కాంత్ వ్యాఖ్యానించారు. కనీస మద్దతు ధర, మండీలు కొనసాగుతాయని రైతులు అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. రైతులు తమకు నచ్చిన విధంగా పంటను అమ్ముకునే సౌలభ్యాన్ని కొత్త చట్టాలు అందిస్తున్నాయని నూతన వ్యవసాయ చట్టాలపై స్పందించారు.