కమలానికి కఠినం: 2014లో 51 స్థానాల్లో మెజారిటీ సీట్లు! ఈ సారి ఎదురీత?
న్యూఢిల్లీ: దేశంలో ఏడు రాష్ట్రాల్లో ప్రస్తుతం కొనసాగుతోన్న అయిదో విడత లోక్సభ ఎన్నికలకు ఓ ప్రత్యేకత ఉంది. 2014లో ఈ దశలోనే భారతీయ జనతాపార్టీ తన హవాను కొనసాగించింది. అత్యధిక స్థానాలను తన ఖాతాలో వేసుకోగలిగింది. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ కంటే అత్యధిక సీట్లను దక్కించుకోవడానికి కారణమైంది అయిదో విడత ఎన్నికలే. ఎన్డీఏ కూటమిలో మరో పార్టీ మద్దతు అవసరమే లేకుండా కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన స్థానాలను కైవసం చేసుకోగలిగారు కమలనాథులు. అయిదేళ్లు తిరిగే సరికి.. కాషాయ పార్టీ కఠిన సవాళ్లను ఎదుర్కొంటోంది.
మహాకూటమి రూపంలో ప్రతిబంధకం..
బీజేపీ హవాను అడ్డుకోవడానికి ఉత్తర్ప్రదేశ్లో ప్రతిపక్ష పార్టీలు ఏకమైన విషయం తెలిసిందే. నిప్పు-ఉప్పులా ఉండే సమాజ్వాది పార్టీ, బహుజన్ సమాజ్వాది పార్టీ పొత్తు పెట్టుకున్నాయి. రాష్ట్రీయ లోక్దళ్ను కూడా కలుపుకొని మహాకూటమిలా ఆవిర్భవించాయి. 80 స్థానాలు ఉన్న ఉత్తర్ప్రదేశ్లో రెండింటిని వదిలేసి..మిగిలిన అన్ని చోట్లా పోటీలో ఉన్నాయి. ఎస్పీ-బీఎస్పీ-ఆర్ఎల్డీ కూటమి కట్టడం బీజేపీకి ఏమాత్రం మింగుడు పడని విషయం అనడంలో సందేహాలు అక్కర్లేదు. ఎందుకంటే- మహాకూటమి దెబ్బకు కంచుకోటగా భావించిన గోరఖ్పూర్ వంటి లోక్సభ స్థానాన్ని పోగొట్టుకుంది బీజేపీ.
ఫలించిన ఫార్ములా..
స్వయంగా ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వరుసగా అయిదేళ్ల పాటు జైత్రయాత్ర సాగించిన గోరఖ్పూర్ స్థానాన్ని ఎస్పీ-బీఎస్పీ కూటమికి ధారదాత్తం చేసుకోవాల్సి వచ్చింది. నిజానికి- గోరఖ్పూర్ లోక్సభ ఉప ఎన్నిక సందర్భంగా ఎస్పీ-బీఎస్పీ ఓ ప్రయోగం చేశాయి. ఉమ్మడి అభ్యర్థిని బరిలో దింపితే ఫలితం ఎలా ఉండొచ్చంటూ ట్రయల్ వేశాయి. అది కాస్తా ఘన విజయం సాధించింది. దీనితో లోక్సభ ఎన్నికల్లోనూ కూటమి కట్టాయి. ప్రస్తుతం ఈ వ్యవహారమే బీజేపీకి జీర్ణం కావట్లేదు.
2014లో 39 సీట్లు..
2014 నాటి ఎన్నికల్లో అయిదో విడత కింద 51 లోక్సభ స్థానాలకు పోలింగ్ నిర్వహించారు. ఈ దశలో బీజేపీ అత్యధిక స్థానాలను దక్కించుకోగలిగింది. 51 స్థానాల్లో 39 సీట్లను సొంతం చేసుకోగలిగింది బీజేపీ. తృణమూల్ కాంగ్రెస్-7, కాంగ్రెస్-2, రాష్ట్రీయ లోక్శక్తి పార్టీ, పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ, లోక్ జనశక్తి పార్టీ తలా ఓ స్థానాన్ని చేజిక్కించుకున్నాయి. 2014 ఉత్తర్ ప్రదేశ్లో 14 స్థానాలకు పోలింగ్ జరగ్గా 12 చోట్ల కాషాయ జెండా ఎగిరింది. రాజస్థాన్-12, మధ్యప్రదేశ్-7 జార్ఖండ్-4 సీట్లల్లో పోలింగ్ నిర్వహించగా క్లీన్స్వీప్ చేసేసింది. అదే పరిస్థితి ఈ సారీ తలెత్తుతుందా? అనేది అనుమానమే. ఈ అనుమానం చివరికి బీజేపీ నేతలనూ పట్టి పీడిస్తోంది.
రాజస్థాన్లో ప్రతికూల పవనాలే..
2014 నాటి ఎన్నికల్లో అయిదో విడత పోలింగ్లో రాజస్థాన్లో 12 చోట్ల ఎన్నికలను నిర్వహించారు. ఆ స్థానాలన్నింట్లో బీజేపీ ఘన విజయం సాధించింది. ఈ సారి ఆ పరిస్థితి తలెత్తకపోవచ్చు. రాజస్థాన్లో అధికారాన్ని పోగొట్టుకుంది. ప్రస్తుతం అక్కడ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. అధికారంలో ఉండి కూడా 12 స్థానాలను ఒకేసారి పోగొట్టుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఏ మాత్రం సిద్ధపడదు. మెజారిటీ స్థానాలను దక్కించుకోవడానికే ప్రయత్నాలు సాగిస్తుంది. ఈ రకంగా చూస్తే.. రాజస్థాన్లో బీజేపీకి ఈ దశలో మెజారిటీ సీట్లు దక్కకపోవచ్చనేది విశ్లేషకుల అంచనా.
హంగ్ తప్పదా?
పోలింగ్ సరళిని ముందుగానే అంచనా వేయడం వల్లే బీజేపీ నాయకులు అందరి కంటే రెండడుగులు ముందే ఉన్నారు. ప్రాంతీయ పార్టీలకు గాలం వేస్తున్నారు. ఆయా పార్టీల నాయకులతో మంతనాలు మొదలు పెట్టేశారు కూడా. ఇందులో భాగంగానే- బీజేపీ చీఫ్ అమిత్ షా.. ఇటీవలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో మంతనాలు సాగించినట్లు వార్తలు వచ్చాయి. తెలంగాణ రాష్ట్ర సమితిని కూడా సంప్రదించే అవకాశాలు లేకపోలేదు. ప్రస్తుతం గులాబీ బాస్ కేసీఆర్ ప్రస్తుతం తటస్థంగా ఉన్నారు. కేంద్రంలో ఏ పార్టీకీ మద్దతు ఇచ్చే ఆలోచనలో లేరు. సొంతంగా ఫెడరల్ ఫ్రంట్ పేరుతో మూడో కూటిమికి తనవంతు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఈ దశలో కాంగ్రెస్ కు, బీజేపీకి సమదూరాన్ని పాటిస్తోన్న మమతా బెనర్జీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి వంటి నాయకులు కేసీఆర్ తో జట్టుకట్టడానికే మొగ్గు చూపవచ్చు.