సిగరేట్ ప్రియులకు షాక్: విడి అమ్మకాలపై నిషేధం!
న్యూఢిల్లీ: సిగరేట్ ప్రియులకు కేంద్రం త్వరలోనే మరో గట్టి షాక్ ఇవ్వబోతోంది. సిగరేట్ల చిల్లర(లూజ్) అమ్మకాలను నిషేధించాలని నిర్ణయించింది. ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్డుకుని ఇప్పటికే పొగాకు ఉత్పత్తులపై ఆంక్షలు విధించిన కేంద్రం, సిగరెట్ల ధరలను కూడా పెంచింది.
ఇక ఇప్పుడు చిల్లర అమ్మకాలపై నిషేధం విధించనుంది. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే ధూమపాన ప్రియులు విడిగా కాకుండా ప్యాకెట్లను చచ్చినట్టు కొనుగోలు చేయక తప్పదు. అంటే ఒకటి రెండు సిగరెట్లు ఖరీదు చేసే వీలుండదు. దేశంలో 70శాతం వినియోగదారులు ఒకటి రెండు సిగరెట్లే కొంటారు.
ఇలాంటి వాటివల్లే సిగరెట్ల అమ్మకాలు పెరుగుతున్నాయని ప్రభుత్వం నియమించిన నిపుణుల సంఘం నిర్ధారించినట్టు ఆరోగ్య మంత్రి జేపి నడ్డా రాజ్యసభకు తెలియచేశారు. 2012లో మన దేశంలో 120 బిలియన్ సిగరెట్లు అమ్ముడుపోయాయి. నిపుణుల కమిటీ అందించిన నివేదికను ప్రభుత్వం ఆమోదించిందని నడ్డా తెలిపారు.
కేబినెట్ ఆమోదించగానే పార్లమెంట్ ఆమోదం పొందుతామని ఆయన చెప్పారు. ప్రభుత్వ ఖజానాకు సిగరెట్ ఉత్పత్తి సంస్థల నుంచి సాలీనా 25వేల కోట్లు ఆదాయం లభిస్తున్నా, ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వం చిల్లర అమ్మకాలు నిషేధించాలన్న నిర్ణయం తీసుకుందని నడ్డా తెలిపారు.