తక్కువ డబ్బులతో ఎక్కువ ఛానెళ్లు: కొత్త టారిఫ్లను ప్రకటించిన ట్రాయ్
ఎక్కువ డబ్బులు తీసుకుని తక్కువ ఛానెల్స్ వీక్షించడం ప్రస్తుతం జరుగుతోంది. అయితే ఇందుకు భిన్నంగా టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ఆదేశాలు జారీ చేసింది. ఇకపై తక్కువ డబ్బులు చెల్లించి ఎక్కువ ఛానెల్స్ వీక్షించేలా ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు న్యూటారిఫ్ ఆర్డర్లో సవరణలు చేసింది. ఈ కొత్త సవరణల ప్రకారం కేబుల్ ఆపరేటర్లు తమ వినియోగదారులకు దాదాపు 200 ఛానెళ్లు నెలకు రూ.153కే అందిచాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఇది పన్నులతో కలిపి ఉంటుందని వెల్లడించింది.
న్యూటారిఫ్ ఆర్డర్లో సవరణలు
న్యూ టారిఫ్ ఆర్డర్లో ఉన్న పలు ప్రొవిజన్లు లేదా అంశాలను ట్రాయ్ క్షుణ్ణంగా పరిశీలించింది. ఆ తర్వాత గరిష్టంగా తీసుకుంటున్న డబ్బులకు 200 ఛానెళ్లు వినియోగదారులకు అందించాల్సిందేనంటూ సవరణలు చేసి ఆదేశాలు జారీ చేసింది. నెలకు రూ.130 అదే పన్నులతో కలిపి రూ.153 చెల్లిస్తే ఈ ఛానెళ్లు అందించాలని హుకూం జారీ చేసింది. ప్రస్తుతం డీటీహెచ్, కేబుల్ టీవీ ఆపరేటర్లు తమ వినియోగదారులకు నెలకు రూ.153 చెల్లిస్తే 100 ఛానెళ్లను మాత్రమే అందిస్తున్నారు.
ఉచిత ఛానెళ్ల కోసం రూ. 160 చెల్లించాలి
ఇక ఇదే సమయంలో వినియోగదారులు ఉచిత ఛానెళ్ల కోసం రూ. 160 చెల్లించాలని ఫిక్స్ చేసింది ట్రాయ్. అంటే తక్కువ డబ్బు చెల్లించి ఎక్కువ ఛానెళ్లను వినియోగదారులు వీక్షించేలా వెసులుబాటు కల్పించింది ట్రాయ్. జనవరి 15వ తేదీ నుంచి రేట్లకు సంబంధించి కొత్త విధానంను ప్రకటించాలని కేబుల్ ఆపరేటర్లకు ట్రాయ్ సూచించింది.
వినియోగదారుల ప్రయోజనాల కోసమే నిర్ణయం
వాటాదారులు ప్రత్యేకించి వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రాయ్ ప్రకటించింది. ఇక ఒకే వ్యక్తి పేరుపై ఒకే ఇంట్లో రెండు కనెక్షన్లు ఉంటే మొత్తం చెల్లిస్తున్న ఫీజులో రెండో టీవీకి లేదా రెండో కనెక్షన్కు అదనంగా 40శాతం చెల్లించాలనే నిబంధనను తీసుకొచ్చింది. ఇదిలా ఉంటే కేంద్ర సమాచారా ప్రసార మంత్రిత్వ శాఖ ప్రకటించిన మ్యాండేటరీ ఛానెళ్లు ఎన్సీఎఫ్ పరిధిలోకి రావు. అంతకుముందు ఫ్రీ-టూ-ఎయిర్ కేటగిరీలో ఇచ్చే ఛానెళ్లకు ఎలాంటి పరిధి ఉండేది కాదు. అయితే కొత్త నిబంధనలతో ఫ్రీ-టూ-ఎయిర్ కేటగిరీలోకి కొన్ని ఛానెళ్లు చేరే అవకాశం ఉంది.
భారీగా పడిపోనున్న కేబుల్ ఆపరేటర్ల రెవిన్యూ
కొత్తగా తీసుకు వచ్చిన నిబంధనలతో కేబుల్ ఆపరేటర్ల రెవిన్యూ తగ్గే అవకాశం ఉంది. గతేడాది వరకు ఉన్న నిబంధనలతో కేబుల్ ఆపరేటర్ల రెవిన్యూ అమాంతంగా 60శాతానికి పెరిగిందని నిపుణులు చెబుతున్నారు.2017లో తీసుకొచ్చిన నిబంధనలను సవరిస్తూ ట్రాయ్ కొత్తగా రూల్స్ తీసుకొచ్చింది. అయితే ఈ కొత్త నిబంధనలు మార్చి నెల నుంచి అమల్లోకి వస్తాయని ట్రాయ్ స్పష్టం చేసింది.