అసౌకర్యం చింతిస్తున్నాం: ట్రైన్ బుకింగ్స్, క్యాన్సలేషన్ ఏడు రోజులు, ఆరు గంటలు బంద్
న్యూఢిల్లీ: రైలు ప్రయాణికులకు కొంత అసౌకర్యానికి గురిచేసే వార్త ఇది. రైలు టికెట్ల రిజర్వేషన్ సౌకర్యం ఆరు రోజులపాటు అర్ధరాత్రి సమయాల్లో అందుబాటులో ఉండదని దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. నవంబర్ 14వ తేదీ రాత్రి 11.30 గంటల నుంచి నవంబర్ 15వ తేదీ ఉదయం 5.30 గంటల వరకు రిజర్వేషన్ సౌకర్యం నిలిపివేయనున్నారు.
ఇదే తరహాలో నవంబర్ 20వ తేదీ ఉదయం 5.30 గంటల వరకు రిజర్వేషన్ సేవలు అందుబాటులో ఉండవని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేశ్ ఓ ప్రకటనలో తెలిపారు. మొత్తం ఏడు రోజులపాటు ఆరేసి గంటలపాటు ఈ అసౌకర్యం ఏర్పడుతోందని, ప్రయాణికులు సహకరించాలని రైల్వే శాఖ విజ్ఞప్తి చేసింది.
దక్షిణ మధ్య రైల్వేతోపాటు దేశ వ్యాప్తంగా అన్ని రైల్వే జోన్లలోనూ ఏడు రోజులపాటు రిజర్వేషన్లకు సంబంధించి ఇదే పరిస్థితి ఉంటుందని రైల్వే వర్గాలు వెల్లడించాయి. ప్రత్యేక రైళ్ల నెంబర్లకు బదులుగా సాధారణ రైళ్ల నెంబర్లతో రైళ్లు నడపనున్న నేపథ్యంలో దీనికి సంబంధించిన ప్రక్రియ కోసం ఆయా గంటల్లో సేవలను నిలిపివేస్తున్నట్లు తెలిపింది.
కాగా, కరోనా మహమ్మారి నేపథ్యంలో ఇప్పటి వరకు ప్రత్యేక రైళ్లు నడిపిన రైల్వే శాఖ ప్రస్తుత పరిస్థితులు అనుకూలంగా మారడంతో సాధారణ రైలు సర్వీసులను పునరుద్ధరించే ప్రక్రియ ప్రారంభించింది. ఇందులో భాగంగా రిజర్వ్డ్ రైళ్ల నంబర్లను అప్ లోడ్ చేస్తోంది. దీనికి సంబంధించిన అన్ిన మెయిల్, ఎక్స్ ప్రెస్, పాత రైళ్ల నెంబర్లను, ప్రస్తుత ప్యాసింజర్ బుకింగ్ డేటాతో పాటు అప్డేట్ చేయాల్సి ఉంటుంది. టికెటింగ్ సర్వీసులపై ప్రభావం పడకుండా రాత్రి సమయంలో రైల్వే శాఖ ఈ ప్రక్రియ చేపడుతోంది.
Recommended Video
ఈ నేపథ్యంలోనే ఆయా తేదీల్లో రిజర్వేషన్, కరెంట్ బుకింగ్, టికెట్ క్యాన్సిలేషన్ వంటి సేవలు అందుబాటులో ఉండవు. రిజర్వేషన్ సేవలు మినహా 139 టెలిఫోన్ సేవలు సహా మిగితా అన్ని విచారణ సేవలు ఎలాంటి అంతరాయాలు లేకుండా అందుబాటులో ఉంటాయని రైల్వే శాఖ తెలిపింది. మార్పు చేసినర రైళ్ల నెంబర్లను ఇప్పటికే టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణికులకు ఎస్ఎంఎస్ ద్వారా తెలియజేస్తామని పేర్కొంది. ఇతర సంబంధిత వివరాలు విచారణ కేంద్రాలు, హెల్ప్డెస్క్ల తెలుసుకోవచ్చు.