గులాబీల స్వాగతం: ఇక రైళ్లలో ట్రెయిన్ హొస్టేస్!
న్యూఢిల్లీ: రైల్వేలో పలు సంస్కరణలు తీసుకొస్తున్న రైల్వే శాఖ తాజా మరో ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా విమానాల్లో లాగే త్వరలో రైలు ప్రయాణికుల కోసం ట్రెయిన్ హోస్టెస్లు రానున్నారు.
దేశంలో ఢిల్లీ- ఆగ్రాల మధ్య నడిచే మొదటి సెమీ హైస్పీడ్ రైలు అయిన గతిమాన్ ఎక్స్ప్రెస్లో ఈ ట్రెయిన్ హోస్టెస్ల ఏర్పాటుకు రైల్వే శాఖ సన్నాహాలు చేస్తోంది. ఈ రైళ్లలో ట్రెయిన్ హొస్టేస్ ప్రయాణికులకు గులాబీ పూలతో స్వాగతం పలకనున్నారు.
మార్చిలో ఈ రైలు సర్వీసులు ప్రారంభించనున్నారు. ఈ రైల్లో హై-పవర్ అత్యవసర బ్రేకింగ్ సిస్టమ్, ఆటోమేటిక్ ఫైర్ అలారం, స్లైడింగ్ ద్వారాలతో పాటు లైవ్ టీవీ సౌకర్యం ఉంది. విమాన సర్వీసుల్లాగే గతిమాన్ రైల్లో క్యాటరింగ్ సర్వీసుతో పాటు అన్ని సౌకర్యాలు ఏర్పాటుచేయడానికి సన్నాహాలు చేస్తోంది.
కాగా, ఈ విశేషాలను రైల్వే మంత్రి సురేశ్ ప్రభు ఫిబ్రవరి 25న ప్రవేశపెట్టనున్న రైల్ బడ్జెట్లో ప్రకటించనున్నారు. టికెట్ ధర శతాబ్ది ఎక్స్ప్రెస్ ధర కంటే 25 శాతం ఎక్కువగా ఉండనుంది. క్యాటరింగ్లో భారతీయ వంటకాలతోపాటు విదేశీ వంటకాలు ఉంటాయి.
ఇలాంటి రైళ్లను కాన్పూర్-ఢిల్లీ, ఛండీగడ్-ఢిల్లీ,హైదరాబాద్-చెన్నై, నాగ్పూర్- బిలాస్పూర్, గోవా-ముంబయి, నాగ్పూర్-సికింద్రాబాద్ల మధ్య కూడా నడపాలని రైల్వే శాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.