అక్కడ రెండ్రోజులు రైళ్లు, మూడ్రోజులు మొబైల్ ఇంటర్నెట్ బంద్.. ఎక్కడంటే..
వివాదాస్పద మతగురువు గుర్మీత్ రామ్ రహీమ్ కేసులో న్యాయస్థానం శుక్రవారం తీర్పు వెల్లడించనున్న నేపథ్యంలో పంజాబ్, హరియాణా, చండీగఢ్ ప్రాంతాల్లో 72 గంటల పాటు మొబైల్ ఇంటర్నెట్ సేవలు బంద్ అవనున్నాయి.
రాయ్పూర్: పంజాబ్, హర్యానా, చండీగఢ్ ప్రాంతాల్లో 72 గంటల పాటు మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. డేరా సచ్చా సౌదా అధిపతి, వివాదాస్పద మతగురువు గుర్మీత్ రామ్ రహీమ్ ఎదుర్కొంటున్న హత్య, అత్యాచార కేసులో న్యాయస్థానం శుక్రవారం తీర్పు వెల్లడించనుంది.
ఈ నేపథ్యంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ముందస్తు భద్రతగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు హరియాణా అడిషనల్ చీఫ్ సెక్రటరీ(హోం) నివాస్ తెలియజేశారు. రెండు రోజుల పాటు చండీగఢ్కు వచ్చే ప్యాసింజర్ రైళ్ల సర్వీసులను కూడా రద్దు చేయాల్సిందిగా రైల్వేశాఖను ఆయన కోరారు.
ఇప్పటికే హర్యానా నుంచి చండీగఢ్, పంచకుల వచ్చే బస్సు సర్వీసులను రెండు రోజుల పాటు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయా ప్రాంతాల్లోని కళాశాలలు, పాఠశాలలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు సెలవులు ప్రకటించారు. అన్ని జిల్లాలోను 144 సెక్షన్ను అమల్లోకి తీసుకొచ్చారు.
భద్రత కోసం దాదాపు 18 కంపెనీలకు చెందిన పారామిలటరీ బలగాలను రంగంలోకి దించారు. తీర్పు వెలువరించనున్న పంచకులలోని న్యాయస్థానానికి హాజరవుతున్నట్లు గుర్మీత్ ఇప్పటికే ప్రకటించారు. ఇద్దరు మహిళా సాధ్వీలపై అత్యాచారానికి పాల్పడినట్లు గుర్మీత్పై కేసు నమోదైంది.