ఆక్సిజన్ ట్యాంకర్లు పంపండి: అన్ని రాష్ట్రాలకు అరవింద్ కేజ్రీవాల్ వేడుకోలు
న్యూఢిల్లీ: రాష్ట్రంలో మెడికల్ ఆక్సిజన్ కొరతను తీవ్రంగా ఎదుర్కొంటున్న క్రమంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఎస్ఓఎస్ పంపించారు. దేశ రాజధానిలో ఏర్పడిన ఆక్సిజన్ కొరతను తీర్చేందుకు సాయం చేయాలని కోరారు.
మీ రాష్ట్రంలో ఆక్సిజన్ మిగులు ఉన్నట్లయితే... తమ రాష్ట్రానికి అందజేయాలని కేజ్రీవాల్ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు విజ్ఞప్తి చేశారు. కేంద్రం కూడా తమకు సాయం చేస్తోందని, అయినా ఆక్సిజన్ కావాల్సిన ఆక్సిజన్ అందడం లేదని చెప్పారు. మీ రాష్ట్రం నుంచి గానీ, మీ రాష్ట్రంలోని ఏదైనా సంస్థ గానీ తమకు ఆక్సిజన్ ట్యాంకర్లను అందిస్తే రుణపడి ఉంటామని, తన విజ్ఞప్తినే ఎస్ఓఎస్ పరిగణించాలని కేజ్రీవాల్ కోరారు.
కరోనా మహమ్మారిపై మనమంతా కలిసికట్టుగా పోరాడాల్సిన సమయమని తెలిపారు. వైరస్కు ఎలాంటి హద్దులూ లేవన్నారు. ప్రపంచానికి మన ప్రభుత్వాల సమర్థతను చాటిచెప్పాలన్నారు. ఢిల్లీలోని చిన్నా పెద్ద ఆస్పత్రుల్లో ఆక్సిజన్ ఖాళీ అయిపోయిందని తెలిపారు. ఆక్సిజన్ సరఫరా అవసరాల మేరకు అందడం లేదన్నారు.
ఆక్సిజన్ కొరత కారణంగా ఢిల్లీలో శనివారం 25 మరణాలు సంభవించాయి. కాగా, కేంద్రం ఢిల్లీకి ఆక్సిజన్ వాటాను 480 మెట్రిక్ టన్నులకు పెంచింది. ఆక్సిజన్ కొరత కారణంగా రోగులు మరణించడంపై ఢిల్లీ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. కరోనా సునామీలా విరుచుకుపడుతోందని, అందుకు అనుగుణంగా ప్రభుత్వాలు ఏర్పాట్లు చేయడంలో అలసత్వం ప్రదర్శించాయని మండిపడింది. ఆక్సిజన్ కొరత కారణంగా మరణాలు సంభవించకుండా చూడాలని హైకోర్టు స్పష్టం చేసింది.
కాగా, ఢిల్లీలో గత కొద్ది రోజులుగా ప్రతి రోజు 20వేలకుపైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. శుక్రవారం అత్యధికంగా 348 మంది మరణించారు. ప్రస్తుతం ఢిల్లీలో 90వేలకుపైగా యాక్టివ్ కేసులున్నాయి. దీంతో రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఏర్పడింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అడుక్కోండి.. అప్పు తీసుకోండి.. దొంగతనం చేయండి.. కానీ, ఆక్సిజన్ కొరత కారణంగా ప్రాణాలు పోకుండా చూడాలని తేల్చి చెప్పింది.