జంతువు కంటే హీనంగా చూస్తున్నారు: యాసిన్ భత్కల్
న్యూఢిల్లీ: దేశంలో వివిధ ప్రాంతాల్లో బాంబు పేలుళ్లకు ప్రధాన సూత్రధారి అయిన ఉగ్రవాది, ఇండియన్ ముజాహిదీన్(ఐఎం) సహ వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్ తనను తీహార్ జైల్లో జంతువు కంటే హీనంగా చూస్తున్నారని సోమవారం న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చాడు.
పవిత్ర రంజాన్ మాసంలో కూడా సరైన ఆహారం ఇవ్వడం లేదని ఆరోపించాడు. గాలీ, వెలుతురు రాని చోట ఏకాంతంగా ఖైదు చేశారనీ, న్యాయస్థానానికి తీసుకువస్తున్నప్పుడే తాను వెలుతురు చూస్తున్నానని తన న్యాయవాది ద్వారా న్యాయస్థానం ముందు వెల్లడించాడు.
కాగా, దీనిపై బుధవారం నివేదికను సమర్పించాల్సిందిగా అదనపు సెషన్స్ న్యాయమూర్తి రాజ్కపూర్ తీహార్ జైలు అధికారులను ఆదేశించారు. యాసిన్ భత్కల్, అతని సహచరుడు అసదుల్లా అక్తర్లను నిరుడు ఆగస్టు 28న భారత్-నేపాల్ సరిహద్దులో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అరెస్ట్ చేశారు.
మహారాష్ట్రలోని ముంబైలో 21 మంది మృతికి కారణమైన 2011 నాటి వరుస పేలుళ్లకు పాల్పడినందుకు తాను గర్వపడుతున్నట్లు యాసిన్ భత్కల్ ఇటీవల పేర్కొన్న విషయం తెలిసిందే. ‘పేలుళ్లకు పశ్చాత్తాపడటం లేదు. నా దృష్టిలో అవి నేరం కాదు. అందుకే వాటికి పాల్పడ్డానని ఒప్పుకుంటూ వాంగ్మూలం ఇవ్వదలుచుకున్నా' అని ముంబై పోలీసులకు ఇచ్చిన నేరాంగీకార వాంగ్మూలంలో భత్కల్ చెప్పాడు. అతడి సహాయకుడు అసదుల్లా అక్తర్ కూడా పేలుళ్లకు పాల్పడినందుకు చింతించడం లేదని నేరాంగీకార వాంగ్మూలంలో పేర్కొన్నాడు.