కర్ణాటక కాంగ్రెస్ కి బిగ్ షాక్: పాటిల్ రాజీనామా? కారణమేంటి..
Recommended Video
బెంగళూరు: ఎలాగోలా బీజేపీ హవాను అడ్డుకోగలిగారు కానీ సొంత పార్టీ నేతల అసంతృప్తులను ఎలా పరిష్కరించాలో కాంగ్రెస్ పార్టీకి అర్థం కావడం లేదు. జేడీఎస్ తో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నేపథ్యంలో.. పదవులు దక్కలేదన్న కారణంతో చాలామంది కాంగ్రెస్ సీనియర్ నేతలు అలకబూనిన పరిస్థితి.
సిద్దరామయ్య ప్రభుత్వంలో మంత్రులుగా చక్రం తిప్పిన తమకు ఇప్పుడు సరైన గుర్తింపు దక్కడం లేదని కొంతమంది సీనియర్లు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎస్ఆర్ పాటిల్ తన పదవికి రాజీనామా చేసి పార్టీకి పెద్ద షాక్ ఇచ్చారు. అయితే పాటిల్ మాత్రం తన రాజీనామాపై జరుగుతున్న ప్రచారాన్ని కొట్టిపారేస్తున్నారు.
రాజీనామాకు కారణమదే?
ఇటీవలి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించకపోయినందువల్లే.. దానికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తున్నానని ఆయన పేర్కొనడం గమనార్హం. అధిష్ఠానం తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిందని, కానీ ఎన్నికల్లో పార్టీని గెలుపు దిశగా నడిపించలేకపోయానని ఆయన చెప్పారు. పార్టీ అభ్యర్థులను గెలిపించడంలో విఫలమైనందువల్లే తాను రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నానని తెలిపారు.
పదవి ఆశించి భంగపడ్డారా?
మరోవైపు.. పైకి ఆయన ఈ కారణం చెబుతున్నప్పటికీ డిప్యూటీ సీఎం పదవి తనకు దక్కకపోవడం వల్లే పార్టీ నుంచి తప్పుకోవడానికి సిద్దపడ్డారన్న చర్చ కూడా జరుగుతోంది. జేడీఎస్తో పొత్తుపై తనకు మాటమాత్రమైనా చెప్పకపోవడం, లింగాయత్ కోటాలో డిప్యూటీ సీఎం పదవిని ఆశించి భంగపడడం వంటి కారణాలతో ఆయన రాజీనామా చేసినట్టు సమాచారం.
బాదామి పైనే ఫోకస్.. అదే ముంచింది..
ఎస్ఆర్ పాటిల్ రాజీనామాపై కాంగ్రెస్ శ్రేణులు స్పందిస్తూ.. బాగల్ కోట్ జిల్లాలో కాంగ్రెస్ ఓటమికి తోడు ఉత్తర కర్ణాటకలో వైఫల్యమే ఆయన రాజీనామాకు కారణమని చెబుతున్నారు. బాగల్ కోట్ జిల్లాలల్లోని ఐదు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఓటమిపాలయ్యారు.
సిద్దరామయ్య వ్యతిరేక వర్గం బలంగా ఉండటంతో పాటిల్ కేవలం బాదామి పైనే ఎక్కువ ఫోకస్ పెట్టారు. దీంతో మా నియోజకవర్గాలను ఆయన పట్టించుకోలేదని ఓడిపోయిన అభ్యర్థులు బహిరంగంగానే విమర్శించారు. ఇదే విషయంపై విజయానంద్ అనే కాంగ్రెస్ నేత హైకమాండ్ కి కూడా ఫిర్యాదు చేశారు.
సిద్దరామయ్యను గెలిపించడం కోసం..
తాను మంత్రి పదవి కోసం ఆశించి భంగపడ్డానన్న వార్తల్లోనూ నిజం లేదని చెప్పారు పాటిల్. మంత్రి పదవి కావాలని తానెవరిని అడగలేదని స్పష్టం చేశారు.' ఉత్తర కర్ణాటకలో ఎక్కువ సీట్లు గెలిచిన ప్రతీసారి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అందుకే సిద్దరామయ్య బాదామి నుంచి పోటీ చేస్తే దాని ప్రభావం ఇతర నియోజకవర్గాలపై కూడా ఉంటుందని, పార్టీకి కలిసొస్తుందని భావించాం. సీఎం అభ్యర్థిని గెలిపించుకోవడం కూడా మాకు చాలా ముఖ్యం. అందువల్లే కేవలం బాదామి పైనే ఎక్కువ ఫోకస్ పెట్టాం. మిగతా నియోజకవర్గాలను అంతగా పట్టించుకోకపోవడంతో అక్కడ ఓటమి తప్పలేదు' అని పాటిల్ వివరించారు.
పాటిల్ విఫలమయ్యారని..
రెబల్ అభ్యర్థులను బుజ్జగించి నామినేషన్ ఉపసంహరించుకునేలా చేయడంలోనూ పాటిల్ విఫలమయ్యారని పార్టీ నేతలు ఆయనపై ఆరోపణలు చేశారు. కాగా, రాజీనామా విషయం ఆయన ఆదివారం మీడియాకు వెల్లడించినప్పటికీ.. తన రాజీనామా లేఖను గత నెల 25 నే కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీకి పంపించారు. రాహుల్ ప్రస్తుతం విదేశాల్లో ఉండటంతో ఆయన వచ్చాక దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.