త్రిపుర సీఎం విప్లవ్ దేవ్ రాజీనామా-వచ్చే ఏడాది ఎన్నికల వేళ బీజేపీ వ్యూహాలు
వచ్చే ఏడాది ఎన్నికలకు సిద్దమవుతున్న ఈశాన్య రాష్ట్రం త్రిపురలో మరోసారి అధికారం నిలబెట్టుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో చేసిన ప్రయోగాన్నే ఇక్కడ కూడా చేస్తోంది. ప్రజా వ్యతిరేకతను అధిగమించేందుకు ముఖ్యమంత్రుల్ని మారుస్తూ వస్తున్న బీజేపీ.. ఇక్కడ కూడా సీఎం విప్లవ్ దేవ్ ను రాజీనామా చేయాలని కోరింది. దీంతో ఆయన ఇవాళ రాజీనామా సమర్పించారు.
త్రిపుర ముఖ్యమంత్రి పదవికి విప్లవ్ దేవ్ ఇవాళ రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ కు అందజేశారు. అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని శిరసావహించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. క్రమశిక్షణ గల బీజేపీ కార్యకర్తగా అధిష్టానం ఆదేశాల్ని పాటించానని విప్లవ్ దేవ్ తెలిపారు. నిన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయిన విప్లవ్ దేవ్.. బీజేపీ హైకమాండ్ నిర్ణయం ప్రకారం రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.
విప్లవ్ దేవ్ స్ధానంలో కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకునేందుకు బీజేపీ శాసనసభాపక్షం త్వరలో సమావేశం కానుంది. ఇందులో మరో ఎమ్మెల్యేను సీఎంగా ఎన్నుకునేందుకు వీలుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. బీజేపీ ఎమ్మెల్యేల సమావేశంలో రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకోనున్నారు. బీజేపీ శాసనసభా పక్ష సమావేశానికి కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్, బీజేపీ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డేలను కేంద్ర పరిశీలకులుగా నియమించారు.
విప్లవ్ దేవ్ రాజీనామాపై అఖిల భారత తృణమూల్ కాంగ్రెస్ స్పందించింది. త్రిపురలో వేలాది మంది ప్రజలను విఫలం చేసిన సీఎంకు గుడ్ బై & గుడ్ రిడాన్స్! తగినంత నష్టం జరిగింది. ఎంతగా అంటే బీజేపీలోని అగ్రనేతలు కూడా అతని అసమర్థతకు విసుగు చెందారని టీఎంసీ ట్వీట్ లో పేర్కొంది. రాష్ట్రంలో టిఎంసి సాధించిన దానితో బిజెపిలోని వ్యక్తులు చాలా ఉలిక్కిపడుతున్నారు. మార్పు అనివార్యం" అని పార్టీ పేర్కొంది.