TRP Scam:బార్క్ మాజీ సీఈఓ పార్థోదాస్ గుప్తాకు బెయిల్ మంజూరు చేసిన బాంబే హైకోర్టు..!
టీఆర్పీ రేటింగ్స్ స్కామ్లో జైలు శిక్ష అనుభవిస్తున్న బ్రాడ్క్యాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) మాజీ సీఈఓ పార్థోదాస్ గుప్తాకు మంగళవారం బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. రిపబ్లిక్ టీవీ రేటింగ్స్ను పెంచే క్రమంలో పార్థోదాస్ గుప్తా సీఈఓగా ఉన్న సమయంలో అవకతవకలకు పాల్పడ్డారంటూ ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో గతేడాది డిసెంబర్ 24వ తేదీన ఆయన్ను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం జైలు శిక్ష విధించడంతో ఆయన్ను తలోజా జైలుకు తరలించారు. 2013 జూన్ నుంచి 2019 నవంబర్ వరకు బార్క్ సీఈఓగా బాధ్యతలు నిర్వర్తించారు. ఈ సమయంలోనే రిపబ్లిక్ టీవీ రేటింగ్స్ను పెంచేందుకు అక్రమమార్గం తొక్కారు. ఇందులో భాగంగా అర్నాబ్ గోస్వామి నుంచి 12వేల అమెరికన్ డాలర్లు, మరో రూ.40 లక్షలు ముడుపులు తీసుకున్నారనే ఆరోపణలు వచ్చాయి.
ఇక సెషన్ కోర్టు జైలు శిక్ష విధించడంతో ముందుగా బెయిల్ దరఖాస్తు చేసుకున్నారు. అయితే సెషన్ కోర్టు బెయిల్ మంజూరు చేసేందుకు నిరాకరించడంతో పార్థోదాస్ గుప్తా బాంబే హైకోర్టును బెయిల్ కోసం గత నెల ఆశ్రయించారు. ఫిబ్రవరి 16న వాదనలు విన్న ధర్మాసనం ఆదేశాలను రిజర్వ్లో ఉంచింది. వాదనల సందర్భంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ శిషిర్ హిరే బార్క్ ఫోరెన్సిక్ ఆడిట్ రిపోర్టుపైనే ఆధారపడి వాదనలు వినిపించారు. ఇందులో భాగంగా చాలామంది బార్క్ మాజీ అధికారులతో దాస్గుప్తా వాట్సాప్ చాటింగ్లు చేశారంటూ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపించారు. అంతేకాదు అర్నాబ్ గోస్వామితో కూడా దాస్ గుప్తా వాట్సాప్ చాటింగ్లను ధర్మాసనం ముందు ఉంచారు.
అయితే కేసును విచారణ చేస్తున్న జస్టిస్ నాయిక్ పుల్వామా ఘటన గురించి మరింత సమాచారం ఉందా అని ప్రశ్నించారు. ఈ ఘటనకు సంబంధించి గోస్వామి మరియు దాస్గుప్తాల మధ్య చాటింగ్ జరిగిందా అని ప్రశ్నించి ఒకవేళ జరిగుంటే వేరుగా ఏమైనా కేసు నమోదు చేశారా అని ప్రశ్నించారు. దీనికి ప్రాసిక్యూటర్ నుంచి సమాధానం లేదు అని వచ్చింది. దీంతో దాస్గుప్తా తరపున వాదనలు వినిపిస్తున్న సీనియర్ అడ్వకేట్ ఆబాద్ పాండా వెంటనే లేచి తన క్లయింట్ అయిన దాస్గుప్తాను ఇక జైలులో ఉంచాల్సిన పనిలేదని వాదనలు వినిపించారు. తన క్లయింటు గత మూడేళ్లలో రూ.10 కోట్లు ఆదాయపు పన్ను కట్టారని గుర్తు చేసిన అడ్వకేట్ ఆబాద్ పాండా... కేవలం ఆ చిన్న మొత్తానికి టీఆర్పీ మానుపులేట్ చేయాల్సిన అవసరం తనకు లేదని వాదించారు. వాట్సాప్ చాట్ సరదాగా ఉండి ఉండొచ్చని చెబుతూ న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు.
ఇక ఈ కేసుకు సంబంధించి మెట్రోపాటిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో విచారణ జరిగిందని, ఆరోపణలు ఎదుర్కొంటున్న బార్క్ సీఓఓ రోమిల్ రామ్ఘరియాకు ఇప్పటికే బెయిల్ మంజూరు అయిన విషయాన్ని గుర్తు చేశారు. ఆడిట్ రిపోర్టు ప్రకారం బార్క్ సీఓఓ రామ్ఘరియానే టీఆర్పీని మానిపులేట్ చేశారనే విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అయితే స్నేహితుడిగా గోస్వామి వెంట నిలుస్తానని దాస్గుప్తా అన్నారు తప్పితే తన విలువలకు ఎట్టి పరిస్థితుల్లో వ్యతిరేకంగా వ్యవహరించేది లేదని తేల్చి చెప్పినట్లు కోర్టుకు తెలిపారు ఆబాద్ పాండా.
వాదనలు విన్న న్యాయస్థానం బార్క్ మాజీ సీఈఓ పార్థో దాస్ గుప్తాకు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.