మానవత్వమా నీవెక్కడ?: రక్తపుమడుగులో ఉంటే.. ప్రాణం కంటే ఉల్లిగడ్డలే ఎక్కువయ్యాయి!
ముంబై: మానవత్వం అనేది మనుషుల్లో ఉంటుందన్న మాట నేటి జనం ప్రవర్తిస్తున్న తీరును చూస్తుంటే మాత్రం అబద్ధమనే అనిపించకమానదు. ఇందుకు మహారాష్ట్రలోని పుణెలో చోటు చేసుకున్న ఓ ఘటన నిదర్శనంగా నిలుస్తోంది.
ఉల్లిగడ్డల లోడ్తో వెళుతున్న ఓ ట్రక్కు లోనవాలా సమీపంలోని వాల్వాన్ బ్రిడ్జి వద్ద బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ కిందపడటంతో తీవ్రగాయాలయ్యాయి. ఆయన రక్తపు మడుగులో సాయం కోసం ఎదురుచూస్తున్నాడు.
ఒక్కసారిగా అక్కడికి చేరుకున్న జనం బోల్తా పడిన లారీలోని ఉల్లి గడ్డలను ఎత్తుకెళ్లారు. ఒకరి తర్వాత ఒకరు గుంపులుగా వచ్చి ఆ ఉల్లి గడ్డలను ఎత్తుకెళ్లారు. అయితే, పక్కనే రక్తపు మడుగులో పడివున్న డ్రైవర్ను ఆస్పత్రికి తరలించాలన్న ఇంగిత జ్ఞానం కూడా లేకపోయింది వారికి. మానవత్వం అనేది వారిలో ఒకటుందని వారంతా మర్చిపోయి వ్యవహరించిన తీరు విమర్శలకు తావిచ్చింది.
చివరకు సమాచారం అందుకున్న పోలీసులు వచ్చి ఆ డ్రైవర్ను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలిసింది. లారీ అదుపుతప్పడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. గురువారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.