అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అరెస్టు: కోర్టు అనుమతి ఇచ్చినా, ప్రజలకు!
చెన్నై: తమిళనాడులో జయలలిత మరణించిన తరువాత కక్షసాధింపు అరెస్టులు మళ్లీ మొదలైనాయి. తమిళనాడు ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసి టీటీవీ దినకరన్ వర్గంతో కలిసి తిరుగుతున్న అన్నాడీఎంకే పార్టీ రెబల్ ఎమ్మెల్యే, మాజీ మంత్రిని శనివారం పోలీసులు అరెస్టు చేశారు.
ఉద్యోగాలు ఇప్పిస్తాం
2011లో జయలలిత ముఖ్యమంత్రి అయిన సమయంలో సీనియర్ ఎమ్మెల్యే సెంథిల్ బాలాజీని ఆ రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా నియమించారు. తరువాత సెంథిల్ బాలాజీ రవాణా శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామని అనేక మంది దగ్గర నగదు తీసుకుని మోసం చేశాడని పెద్ద ఎత్తును ఆరోపణలు రావడంతో జయలలిత సెంథిల్ బాలాజీని మంత్రి పదవి నుంచి తప్పించారు.
మంత్రి పదవి ఇవ్వలేదు
ఎడప్పాడి పళనిస్వామి మంత్రి వర్గంలో సెంథిల్ బాలాజీకి స్థానం లభించలేదు. అప్పటి నుంచి ఎడప్పాడి పళనిస్వామి ప్రభుత్వం మీద సెంథిల్ బాలాజీ గ్రూపు రాజకీయాలు చేస్తున్నారు. టీటీవీ దినకరన్ తో కలిసి సెంథిల్ బాలాజీ తమిళనాడు ప్రభుత్వం మీద కక్షకట్టారు.
ఎంజీఆర్ శత జయంతి
టీటీవీ దినకరన్ వర్గం ఎంజీఆర్ శత జయంతి వేడుకలు నిర్వహించాలని, అనుమతి ఇవ్వాలని పోలీసులకు మనవి చేశారు. శాంతి భద్రత సమస్యల కారణంగా అనుమతి ఇవ్వడం కుదరదని పోలీసులు తేల్చి చెప్పారు. పోలీసుల తీరును వ్యతిరేకిస్తూ మాజీ మంత్రి, రెబల్ ఎమ్మెల్యే సెంథిల్ బాలాజీ ఆధ్వర్యంలో కరూరు దగ్గర శనివారం రోడ్డురోకో చేశారు.
ఎమ్మెల్యే అరెస్టు
రోడ్డురోకో నిర్వహించి ప్రజలకు ఇబ్బందులు కలిగించారని ఆరోపిస్తూ మాజీ మంత్రి, అన్నాడీఎంకే పార్టీ రెబల్ ఎమ్మెల్యే సెంథిల్ బాలాజీతో సహ అందర్నీ పోలీసులు అరెస్టు చేశారు. కోర్టు అనుమతి ఇచ్చినా పోలీసులు మాత్రం ఎంజీఆర్ శత జయంతి ఉత్సవాలను అడ్డుకుంటున్నారని టీటీవీ దినకరన్ వర్గీయులు ఆరోపింస్తున్నారు.