షాక్: టీటీవీ దినకరన్ తమిళనాడు సీఎం: పళని ప్రభుత్వం పతనం బీజేపీ ఎంపీ!
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత లేనిలోటుతో తమిళనాడు రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. జయలలిత ప్రాణాలతో ఉన్న సమయంలో అన్నాడీఎంకే పార్టీ గురించి మాట్లాడాలంటే వెనుకా ముందు ఆలోచించే నాయకులు ఇప్పుడు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. తమిళనాడుకు టీటీవీ దినకరన్ ముఖ్యమంత్రి అవుతారని బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి అంటున్నారు.
బీజేపీ పోటి చేసింది
జయలలిత ప్రాతినిధ్యం వహించిన ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి పోటీ చేశారు. అన్నాడీఎంకే పార్టీ అభ్యర్థి మధుసూదనన్, డీఎంకే పార్టీ నుంచి మరదు గణేష్, స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా టీటీవీ దినకరన్ ఆర్ కే నగర్ ఎన్నికల్లో పోటీ చేశారు.
బీజేపీ ఎంపీ జోస్యం
ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి పోటీ చేసినా విజయం మాత్రం టీటీవీ దినకరన్ నే వరిస్తుందని పోలింగ్ కు ముందు బీజేపీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్యస్వామి జోస్యం చెప్పడంతో సొంత పార్టీ నాయకులు ఆయన మీద అసహనం వ్యక్తం చేశారు.
శశికళ వైపు బీజేపీ ఎంపీ !
జయలలిత మరణించిన తరువాత తమిళనాడులో అన్నాడీఎంకే పార్టీని కాపాడేది శశికళ, ఆమె కుటుంబ సభ్యులు మాత్రమే అని సుబ్రమణ్యస్వామి అనేక సార్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. మొదటి నుంచి శశికళ, టీటీవీ దినకరన్ కు మద్దతుగా సుబ్రమణ్యస్వామి మాట్లాడుతున్నారు.
టీటీవీ దినకరన్ సీఎం
తమిళనాడుకు టీటీవీ దినకరన్ కచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్యస్వామి ట్వీట్ చేశారు. టీటీవీ దినకరన్ ముఖ్యమంత్రి కాకుండా ఎవ్వరూ అడ్డుకోలేరని సుబ్రమణ్యస్వామి జోస్యం చెప్పారు.
పళనిస్వామి ప్రభుత్వం
తమిళనాడులోని అన్నాడీఎంకే పార్టీ అధికారంలో ఉన్నా ఎడప్పాడి పళనిస్వామి ప్రభుత్వం మాత్రం త్వరలో పడిపోతుందని సుబ్రమణ్యస్వామి అంటున్నారు. ఎడప్పాడి పళనిస్వామి ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదని చెప్పడానికి బుధవారం జరిగిన అన్నాడీఎంకే పార్టీ ఎమ్మెల్యేల సమావేశం ఓ ఉదాహరణ అని సుబ్రమణ్యస్వామి అంటున్నారు.