టీటీవీ దినకరన్ పై అనర్హత వేటు ?, ఈసీ విచారణ, ఎమ్మెల్యే పదవి: 23 మంది కథ!
చెన్నై: జయలలిత ప్రాతినిధ్యం వహించి ఆమె మరణంతో ఖాళీ అయ్యి జరిగిన ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించిన అన్నాడీఎంకే (అమ్మ) నేత టీటీవీ దినకరన్పై ఎన్నికల కమిషన్ అనర్హత వేటు వేసే అవకాశం ఉందని తెలిసింది. దినకరన్ ఎమ్మెల్యే పదవి ఉంటుందా ? ఊడుతుందా ? అనే అనుమానాలు మొదలైనాయి. మరో వైపు టీటీవీ దినకరన్ కు మద్దతు ఇస్తున్న 23 మంది అన్నాడీఎంకే సీనియర్ నాయకులను పార్టీ నుంచి బహిష్కరించారు.
లెక్కల్లో తేడా, ఈసీ నో!
పరిమితికి మించి ఎన్నికల ఖర్చు చేశారనే అనుమానంతో టీటీవీ దినకరన్ సమర్పించిన లెక్కలకు ఎన్నికల కమిషన్ ఆమోదం తెలపలేదు. ఒకవేళ ఎన్నికల కమిషన్ విచారణలో పరిమితికి మించి ఖర్చు చేసినట్లు వెలుగు చూస్తే ఎమ్మెల్యేగా టీటీవీ దినకరన్ ఎన్నిక చెల్లదని ప్రకటించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
Recommended Video
ఎంత ఖర్చు అంటే!
జయలలిత మరణంతో ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన టీటీవీ దినకరన్ భారీ మెజారిటీతో విజయంసాధించారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత టీటీవీ దినకరన్ తో పాటు ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేసిన మిగిలిన అభ్యర్థులు తమ ఎన్నికల ఖర్చుల లెక్కలను ఎన్నికల కమిషన్ కు సమర్పించారు.
ఎమ్మెల్యే లెక్కలు
ఆర్ కే నగర్ ఎమ్మెల్యే టీటీవీ దినకరన్ సమర్పించిన లెక్కల్లో తేడాలు ఉన్నాయని ఆయన లెక్కలను ఎన్నికల కమిషన్ అధికారులు ఇంత వరకూ ఆమోదించలేదు. దీంతో టీటీవీ దినకరన్ ఎన్నికల ఖర్చుపై ఎన్నికల కమిషన్ మరింత లోతుగా విచారణ జరుపుతోంది.
చెన్నైలో అధికారులు
ఇప్పటికే ఎన్నికల కమిషన్ కు చెందిన కొందరు అధికారులు చెన్నై చేరుకుని టీటీవీ దినకరన్ ఎన్ని రోజులు ఆర్ కే నగర్ లో ప్రచారం చేశారు, ఎన్ని వాహనాలు ఉపయోగించారు. ఎంత డబ్బు పంచిపెట్టారు, ఆయన మీద ఎవరైనా ఫిర్యాదు చేశారా ? అనే కోణంలో విచారణ చేస్తున్నారు.
ఓటుకు రూ. 4 వేలు, రూ. 10 వేలు
ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో టీటీవీ దినకరన్ ఒక్క ఓటుకు రూ. 4,000 నుంచి రూ. 10,000 వరకు పంచిపెట్టారని ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికల కమిషన్, పోలీసుల కళ్లు గప్పి రూ. 20 నోట్ల మీద కోడ్ గుర్తు వేసి ఓటర్లకు ఇచ్చి తరువాత ఆ నోట్లు వెనక్కి తీసుకుని భారీ మొత్తంలో నగదు చెల్లించారని ఆరోపణలు ఉన్నాయి.
దినకరన్ గ్యాంగ్ మీద వేటు
అన్నాడీఎంకే పార్టీ సిద్దాంతాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని, పార్టీ మీద తిరుబాటు చేసిన వారితో కలిసి తిరుగుతున్నారని ఆరోపిస్తూ టీటీవీ దినకరన్ తో సన్నిహితంగా ఉంటున్న 24 మంది నాయకుల మీద పన్నీర్ సెల్వం, పళనిస్వామి వేటు వేశారు. తేని జిల్లాలో 21 మంది, ఈరోడ్ జిల్లాలో ఇద్దరు సీనియర్ నాయకులను పదవుల నుంచి తపిస్తున్నామని శుక్రవారం పళనిస్వామి, పన్నీర్ సెల్వం ఆదేశాలు జారీ చేశారు.