మైక్రోసాఫ్ట్ ఆఫర్: వెల్డర్ కొడుక్కి రూ. కోటి ప్యాకేజీ
బికనీర్: బీహార్ రాష్ట్రానికి చెందిన ఓ బీద యువకుడు.. అమెరికా సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ భారీ ప్యాకేజీతో ఉద్యోగం సంపాదించాడు. రూ. ఏడాదికి 1.02 కోట్ల జీతం ఇచ్చి ఆ యువకుడ్ని తమ కంపెనీలో చేర్చుకోనుంది మైక్రోసాఫ్ట్.
వివరాల్లోకి వెళితే.. ఐఐటీ ఖరగ్పూర్లో బీటెక్ చదివిన 21ఏళ్ల వత్సల్య సింగ్ చౌహాన్ బీహార్లోని ఖగరియా ప్రాంతంలోని సన్హౌలీ గ్రామానికి చెందినవాడు. తండ్రి గ్రామంలో వెల్డింగ్ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. పదో తరగతి వరకు హిందీ మీడియం ప్రభుత్వ పాఠశాలలో చదివిన చౌహాన్.. ఇంటర్లో 75శాతం మార్కులు సాధించాడు.
ప్రతిష్ఠాత్మకమైన ఐఐటీలో చోటు సంపాదించుకొనేందుకు కోట పట్టణంలోనున్న అనేక కోచింగ్సెంటర్లు తిరిగి ఒకదానిలో చేరాడు. ఐఐటీ-జేఈఈలో ఆలిండియాస్థాయిలో 382వ ర్యాంకు సాధించి.. ఐఐటీ ఖరగ్పూర్లో కంప్యూటర్ సైన్స్లో చేరాడు.
డిసెంబర్లో జరిగిన క్యాంపస్ ఇంటర్వ్యూలో మైక్రోసాఫ్ట్ కంపెనీకి ఎంపికైన చౌహాన్కు.. ఆ సంస్థ ఏడాదికి రూ.1.02కోట్ల జీతం ఆఫర్ చేసింది. వత్సల్య సింగ్ చౌహాన్ ఈ అవకాశం దక్కడానికి రాజస్థాన్లోని ప్రవేశపరీక్షల కోచింగ్ సెంటర్లకు కేంద్రమైన కోట కూడా ప్రముఖ పాత్ర పోషించింది.
జూన్లో బీటెక్ పూర్తి చేయగానే.. ఉద్యోగంలో చేరుతానని చౌహాన్ మీడియాకు చెప్పాడు. ఈ విషయంపై చౌహాన్ తండ్రి చంద్రకాంత్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వత్సల చదువుకు 3.50లక్షలు బ్యాంకు నుంచి అప్పు తీసుకొన్నానని.. తన కష్టానికి ప్రతిఫలం దక్కిందని తెలిపారు.