ఈ నరకంలో నేనుండలేను.. నన్ను ఇంటికి తీసుకెళ్ళిపోమ్మా!
ఆమె ఒక చదువుకున్న, స్వతంత్రురాలైన మహిళ. సరిగ్గా రెండేళ్ల క్రితం 2024లో ఒక డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన వ్యక్తితో ప్రేమలో పడింది. గతేడాది 2025 డిసెంబర్లో పెద్దల సమక్షంలో ఎంతో ఘనంగా పెళ్లి కూడా జరిగింది. కానీ, వివాహమైన కేవలం ఐదు నెలలకే.. మే 12న ఆమె అత్తగారింట్లో శవమై తేలింది. ఇది ఆత్మహత్యా? లేక ఆత్మహత్యగా చిత్రీకరించిన పక్కా ప్లాన్డ్ మర్డరా? అనే సస్పెన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో జరిగిన నటి 'ట్విషా శర్మ' అనుమానాస్పద మరణం కేసు.. ఇప్పుడు పోలీసుల ఘోర తప్పిదాలు, దర్యాప్తు లోపాల కారణంగా ఒక హై-ప్రొఫైల్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తోంది.
ఈ కేసులో దర్యాప్తు అధికారుల తీరు తీవ్ర అనుమానాలకు తావిస్తోంది. మే 12న ట్విషా శర్మ బెల్టుతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని అత్తగారింటి సభ్యులు ఆరోపించారు. అయితే, మృతదేహానికి పోస్ట్మార్టం నిర్వహించే సమయానికి ఆ కీలకమైన 'బెల్టు'ను ఎయిమ్స్ భోపాల్ వైద్యులకు పోలీసులు సమర్పించలేదు. సంఘటనా స్థలం నుండి సేకరించిన బెల్టును ఫోరెన్సిక్ ల్యాబ్కు, ఆ తర్వాత ఎయిమ్స్కు పంపడంలో దర్యాప్తు అధికారి ఘోరంగా విఫలమయ్యాడని ఈ కేసు దర్యాప్తు కోసం ఏర్పాటైన సిట్ (SIT) అధిపతి, మిస్రోద్ ఏసీపీ రజనీష్ కశ్యప్ స్వయంగా అంగీకరించారు. ఈ ఘోర తప్పిదం వల్ల ట్విషా మెడపై ఉన్న గాయాలు ఆ బెల్టు వల్లే జరిగాయా లేదా అనే విషయాన్ని వైద్యులు సరిపోల్చలేకపోయారు. దీంతో అసలు ఆధారాలను తారుమారు చేయడానికి ఎవరైనా ప్రయత్నించారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

పోలీసులు రాకముందే శవం మాయం? సీసీటీవీ రికార్డ్!
ట్విషా శర్మ కేసులో మరో విస్తుపోయే నిజం వెలుగులోకి వచ్చింది. ట్విషా మరణించిన సమాచారం అందుకుని పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోకముందే.. ఆమె మృతదేహాన్ని అత్తగారింటి వారు నివాసం నుండి ఆసుపత్రికి తరలించేశారు. అసలు పోలీసులు రాకుండానే మృతదేహాన్ని ఎందుకు అంత అత్యవసరంగా తరలించాల్సి వచ్చింది? దీని వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏంటి? అనే కోణంలో ఏసీపీ రజనీష్ కశ్యప్ నేతృత్వంలోని సిట్ బృందం దర్యాప్తు చేస్తోంది. ప్రస్తుతం ఆ నివాసంలో అమర్చిన సీసీటీవీ (CCTV) ఫుటేజీని అధికారులు క్షుణ్ణంగా విశ్లేషిస్తున్నారు.
A CCTV video captures the final moments of Twisha Sharma walking towards the terrace before she was found dead. Subsequent footage shows family members and others attempting CPR. The case raises several disturbing questions, and much remains to be uncovered. pic.twitter.com/tn9laGDfrI
— Sapna Madan (@sapnamadan) May 19, 2026
రిటైర్డ్ జడ్జి మైండ్ గేమ్.. ఆధారాలు లేవన్న పోలీసులు!
ఈ కేసులో ఏకైక నిందితుడు సమర్థ్ సింగ్ కాగా, అతని తల్లి, రిటైర్డ్ న్యాయమూర్తి గిరిబాల సింగ్ సహ నిందితురాలిగా ఉన్నారు. తనపై వచ్చిన కేసు నుండి తప్పించుకోవడానికి రిటైర్డ్ జడ్జి గిరిబాల సింగ్ ఒక కొత్త వాదనను తెరపైకి తెచ్చారు. తన కోడలు ట్విషా శర్మ ఒక మానసిక రోగి అని, ఆమెకు డ్రగ్స్ అలవాటు ఉందని, డోస్ అందకపోతే విత్-డ్రాయల్ లక్షణాలు చూపించేదని ఆమె ఆరోపించారు. అయితే, చట్టాన్ని చదువుకున్న సదరు మాజీ న్యాయమూర్తి చేసిన ఈ వాదనలను బలపరిచే ఎలాంటి ఆధారాలు పోలీసులకు లభించలేదు.
పైగా, తాము ట్విషాకు ఆన్లైన్ ద్వారా రూ.5,000 నుండి రూ.50,000 వరకు క్రమం తప్పకుండా పంపించామంటూ రసీదులు చూపించి, తాము వరకట్నం అడగలేదని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం గిరిబాల సింగ్కు సెషన్స్ కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేయగా, ఆమె కుమారుడు సమర్థ్ సింగ్కు మాత్రం బెయిల్ నిరాకరించబడింది. పరారీలో ఉన్న సమర్థ్ సింగ్ ఆచూకీ తెలిపిన వారికి భోపాల్ పోలీసులు రూ.10,000 నగదు బహుమతి కూడా ప్రకటించారు.
చాటింగ్స్ లీక్.. 15 కిలోల బరువు తగ్గిన ట్విషా!
ట్విషా తండ్రి నవనిధి శర్మ పీటీఐ (PTI) వార్తాసంస్థతో మాట్లాడుతూ.. తన కుమార్తె వివాహానికి ముందు ఎంతో సంతోషంగా ఉండేదని, కానీ పెళ్లయ్యాక అత్తగారింటి మానసిక, శారీరక వేధింపుల భరించలేక కేవలం ఐదు నెలల్లోనే 15 కిలోల బరువు తగ్గిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. సమర్థ్ సింగ్కు బెయిల్ నిరాకరించడం న్యాయం వైపు పడిన తొలి అడుగు మాత్రమేనని, తల్లి, కొడుకు ఇద్దరినీ అరెస్ట్ చేసినప్పుడే తమకు నిజమైన విజయం లభిస్తుందని ఆయన డిమాండ్ చేశారు.
ట్విషా తన తల్లితో, స్నేహితురాలితో జరిపిన చాటింగ్స్ ఇప్పుడు ఈ కేసులో అత్యంత కీలక సాక్ష్యాలుగా మారాయి.
ట్విషా లీక్డ్ చాట్స్:
"నన్ను ఎలాగైనా ఇంటికి తీసుకెళ్లిపోమ్మా" అంటూ ట్విషా తన తల్లికి సందేశాలు పంపింది. తన స్నేహితురాలికి మెసేజ్ చేస్తూ.. "ఎట్టి పరిస్థితుల్లోనూ వివాహం అనే బంధంలో చిక్కుకోవద్దు" అని హెచ్చరించింది.
అంతేకాదు, తాను గర్భం దాల్చిన తర్వాత జరిగిన అబార్షన్ గురించి, ఆ కడుపులో ఉన్న బిడ్డకు తండ్రి సమర్థ్ సింగేనా అంటూ అతను తన పితృత్వాన్ని ప్రశ్నించిన క్రూరమైన విషయాలను కూడా ట్విషా తన తల్లితో చాట్లో పంచుకుంది. చనిపోయిన రాత్రి 10 గంటల వరకు బంధువులతో ఫోన్లో మాట్లాడిన ట్విషా, ఆ తర్వాతే అనుమానాస్పద స్థితిలో మరణించింది. నిందితులు తమ పలుకుబడిని ఉపయోగించి కేసును అణచివేయాలని చూస్తున్నారని శర్మ కుటుంబం ఆరోపిస్తోంది. మరి ఈ హై-ప్రొఫైల్ మిస్టరీ డెత్ కేసులో పోలీసులు నిందితుడిని ఎప్పుడు పట్టుకుంటారో, ట్విషా మరణానికి అసలైన న్యాయం ఎప్పుడు జరుగుతుందో చూడాలి!
తెలుగులో సినిమా..
ట్విషా శర్మ స్వస్థలం ఉత్తర్ప్రదేశ్లోని నోయిడా. 2012లో మిస్ పుణె అవార్డ్ గెలుచుకున్నారు.. తర్వాత కొన్ని సినిమాల్లో కీలక రోల్స్ ప్లే చేశారు. 2021లో తెలుగులో వచ్చిన 'ముగ్గురు మొనగాళ్లు' సినిమాలో కూడా ట్విషా నటించారు. పలు బ్రాండ్లకు అంబాసిడర్ గా కూడా ప్రమోషన్స్ ఇచ్చారు.














Click it and Unblock the Notifications