ఎంతపనైంది: ఆ ట్వీట్ నేను చేసింది కాదు..మోడీ కోసం ప్రాణాలైనా ఇస్తా అంటున్న బీజేపీ నేత
సీనియర్ బీజేపీ నేత తరుణ్ విజయ్ తన ట్విటర్ అకౌంట్ను డీయాక్టివేట్ చేస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాదు తన ట్విటర్ ఖాతా వ్యవహారాలు చూసే వ్యక్తిని తొలగించినట్లు ఆయన చెప్పారు. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు.
ఇక వివరాల్లోకి వెళితే... బీజేపీ నేత తరుణ్ విజయ్ ట్విటర్ అకౌంట్ పై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని పొగుడుతూ ఒక ట్వీట్ ప్రత్యక్షమైంది. మోడీని విమర్శిస్తున్నట్లుగా ఆ ట్వీట్లో ఉంది. ఇది గమనించిన తరుణ్ విజయ్ వెంటనే దిద్దుబాటు చర్యలకు దిగారు. తను బీజేపీలో చిన్న కార్యకర్తనని చెప్పుకొచ్చాడు. 2019 ఎన్నికల ముందు తనపై కొన్ని బీజేపీ వ్యతిరేక శక్తులు తనపై బురద చల్లే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ప్రధాని మోడీ, అమిత్ షాల కొరకు ప్రాణాలైనా అర్పిస్తానని చెప్పిన తరుణ్ విజయ్... వారు తనకు పండిట్ దీన్దయాల్ ఉపాధ్యాయ్, డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీలు లాంటి వారని అన్నారు. ప్రధాని మోడీ కోసం తనతో పాటు తన కుటుంబ సభ్యులు కూడా రాత్రింబవళ్లు కష్టపడుతారని చెప్పారు.
రాహుల్ గాంధీ మాంసం తిని కైలాష్ మానససరోవర యాత్రకు వెళ్లారా ?
బుధవారం రాత్రి 10 గంటల సమయంలో తరుణ్ విజయ్ ట్విటర్ టైమ్లైన్పై ఓ ట్వీట్ ప్రత్యక్షమైంది. తీర్థయాత్రలకు వెళ్లిన వ్యక్తిపై వ్యక్తిగతపరమైన విమర్శలు చేయడం సరికాదనే ట్వీట్ ప్రత్యక్షమైంది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కైలాష్ మానసరోవర్లో తీర్థ యాత్రకు వెళ్లారు. అదే సమయంలో బీజేపీ పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో తరుణ్ విజయ్ టైమ్లైన్పై ఈ ట్వీట్ కనిపించి ఆయన్ను కంగారు పెట్టింది. తన ఖాతాకు సంబంధించిన పాస్వర్డ్ బయటపడిందని.. ఇది తెలుసుకున్న కొందరు తన ట్విటర్ అకౌంట్ పై పోస్టు చేశారని చెప్పారు. ట్వీట్లను నమ్మకుండా తనకు అండగా నిలిచిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.
రాహుల్ గాంధీకి మద్దతు పలికితే అకౌంట్లు హైజాక్ అవుతాయని కాంగ్రెస్ ప్రతినిధి మనీష్ తివారి ఎద్దేవా చేశారు. ఈ ఘోరం జరిగిన తర్వాత తరుణ్ విజయ్ మోడీకి అనుకూలంగా తన ట్విటర్ పోస్టుపై కథనాలు పోస్ట్ చేశారు. ఉత్తరాఖండ్కు చెందిన ఈ మాజీ ఎంపీ ఒకప్పుడు ఆరఎస్ఎస్ అధికార పత్రిక పంచజన్యకు ఎడిటర్గా వ్యవహరించారు. అయోధ్యలో తిరిగి రామమందిర నిర్మాణం చేపట్టాలని ప్రచారం చేసిన వారిలో తరుణ్ విజయ్ ముందు వరసలో ఉన్నారు.