మళ్ళీ ట్విట్టర్ డౌన్: యూజర్లకు లాగిన్ సమస్యలు; మస్క్ వచ్చాక మూడోసారి!!
ప్రముఖ సోషల్ మీడియా మైక్రో బ్లాగింగ్ ఫ్లాట్ ఫామ్ ట్విట్టర్ మరోమారు మొరాయించింది. ఈరోజు ఉదయం ట్విట్టర్ మళ్ళీ డౌన్ అయింది. ట్విటర్ యూజర్లకు ఎర్రర్ మెసేజ్ కనిపించి ఆ తర్వాత ఆటోమేటిక్ గా లాగ్ అవుట్ అయింది. ఇక ట్విట్టర్ సేవలకు ఇబ్బంది కలగడంతో వినియోగదారులు తీవ్ర అసహనంతో ఉన్నారు.
ట్విట్టర్ .. ఇప్పుడు చాలా మంది జీవితంలో భాగంగా మారిన సోషల్ నెట్ వర్కింగ్ ప్లాట్ ఫాం . అలాంటిది ఈ మధ్య తరచుగా డౌన్ అవుతున్న క్రమంలో వినియోగదారులు ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ట్విటర్ ను కొనుగోలు చేసిన తర్వాత ట్విట్టర్ డౌన్ కావడం ఇది మూడోసారి. దీంతో చాలామంది వినియోగదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. డౌన్ అయిన ప్రతీసారి మొబైల్ యూజర్లు, డెస్క్ టాప్ యూజర్లు కూడా ట్విట్టర్ ను ఉపయోగించ లేకపోతున్నారు. ట్విట్టర్ నోటిఫికేషన్లను సైతం యాక్సెస్ చేయలేకపోతున్నారు.
మైక్రోబ్లాగింగ్ ప్లాట్ఫారమ్ ట్విటర్ పని చేయకపోవడంపై చాలామంది వినియోగదారులు తాము ఆటోమేటిక్గా లాగ్ అవుట్ అవుతున్నామని, మరికొందరు తమ ట్విట్టర్ నోటిఫికేషన్లు కూడా పనిచేయడం లేదని ఫిర్యాదు చేశారు. ఇక సోషల్ మీడియాలోనూ ట్విట్టర్ పనిచేయడం లేదని పోస్టులు పెడుతున్నారు. ట్విట్టర్ తన సామర్థ్యాన్ని మించిపోయిందని, అందుకే ఊరికే ఎర్రర్ ఇష్యూస్ వస్తున్నాయని కొందరంటున్నారు. ఎలాన్ మస్క్ కంపెనీ సీఈఓగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ట్విట్టర్ డౌన్ కావడం ఇది మూడోసారి అని వర్గాలు తెలిపాయి.
అనేకసార్లు రిఫ్రెష్ చేసినప్పటికీ సంథింగ్ వెంట్ రాంగ్ బట్ డోంట్ వర్రీ ఇట్స్ నాట్ యువర్ ఫాల్ట్.. మళ్లీ ప్రయత్నించండి వంటి సందేశాన్ని ఇస్తుందని చెబుతున్నారు. డౌన్ డిటెక్టర్ వెబ్సైట్ ప్రకారం ఢిల్లీ, హైదరాబాద్, నాగపూర్, ముంబై, బెంగళూరు, చెన్నై, మరియు కలకత్తా లతో సహా పలు నగరాలలో ట్విట్టర్ యూజర్లు ఈ సమస్యను ఎదుర్కొన్నారని ఎన్నిసార్లు రిఫ్రెష్ చేసినా మళ్లీ లాగిన్ కాలేక పోయారని పేర్కొంది.