రాహుల్ గాంధీ ఖాతాను పునరుద్ధరించిన ట్విట్టర్: ‘సత్యమేవ జయతే’ అంటూ కాంగ్రెస్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ ట్విట్టర్ ఖాతాను వారం రోజుల తర్వాత ఆ సంస్థ తాజాగా పునరుద్ధరించింది. ఢిల్లీలో అత్యాచారానికి గురైన ఓ దళిత బాలిక కుటుంబాన్ని పరామర్శించి, ఆ చిత్రాలను పంచుకున్నందుకు ఆయన ఖాతాను ట్విట్టర్ గత వారం తాత్కాలికంగా నిలిపివేసిన విషయం తెలిసిందే.
తమ నిబంధనలను ఉల్లంఘించినందుకే రాహుల్ ఖాతాను బ్లాక్ చేసినట్లు ట్విట్టర్ వెల్లడించింది. రాహుల్ తోపాటు మరికొంత మంది పార్టీ నేతల ఖాతాను కూడా తాజాగా, పునరుద్ధరించినట్లు తెలిపింది. కాగా, తన ట్విట్టర్ ఖాతాను నిలిపివేయడంపై రాహుల్ గాంధీ.. ట్విట్టర్ తోపాటు కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే.

ట్విట్టర్ పక్షపాతంగా వ్యవహరిస్తోందని, దేశ రాజకీయ ప్రక్రియలో జోక్యం చేసుకుంటోందని ఆయన ఆరోపించారు. మన రాజకీయాలపై ఆ కంపెనీ వ్యాపారం చేసుకుంటోందని విమర్శించారు. ఈ మేరకు ఓ వీడియోను యూట్యూబ్ వేదికగా పంచుకున్నారు రాహుల్ గాంధీ.
మరోవైపు, ట్విట్టర్ ఇండియా అధిపతిగా ఉన్న మనీశ్ మహేశ్వరిని అమెరికాకు బదిలీ చేస్తూ ఆ సంస్థ శుక్రవారం నిర్ణయం అనూహ్య నిర్ణయం తీసుకుంది. విద్వేషాన్ని రెచ్చగొట్టేలా ఉన్న వీడియోకు సంబంధించి యూపీలో ఆయనపై కేసు నమోదైంది. ఈ క్రమంలో ఆయనను బదిలీ చేయడం చర్చనీయాంశంగా మారింది.
ఇది ఇలావుండగా, తమ ఫొటోను రాహుల్ గాంధీ సోషల్ మీడియాలో పోస్టు చేయడంపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని అత్యాచారానికి గురైన బాధితురాలి తల్లిదండ్రులు తెలిపారు. శుక్రవారం 9ఏళ్ల తమ కూతురు అస్థికలను హరిద్వార్లో కలిపారు. అంత్యక్రియల సందర్భంగా బాధిత కుటుంబానికి పోలీసులు భద్రతగా ఉన్నారు.
ఆగస్టు 4న అత్యాచారానికి, హత్యకు గురైన 9ఏళ్ల బాలిక తల్లిదండ్రులను రాహుల్ గాంధీ కలిశారు. ఈ సందర్భంగా బాధితురాలిని ఓదార్చిన అనంతరం వారితో ఫొటోలు దిగి సోషల్ మీడియాలో పోస్టు చేశారు రాహుల్ గాంధీ. తమ కూతురుకు న్యాయం జరగాలని బాధితురాలి తల్లిదండ్రులు కోరుతున్నారని, వారికి తాను అండగా నిలబడతానని రాహుల్ ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యానించారు.
ఈ పోస్టులో బాధితురాలి తల్లిదండ్రుల ముఖాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఆగస్టు 6న రాహుల్ గాంధీ ట్విట్టర్ ఖాతాను ఆ సంస్థ తాత్కాలికంగా నిలిపివేసింది. అయితే, బాధితురాలి కుటుంబసభ్యులు ఫొటోలను సోషల్ మీడియాలో రాహుల్ గాంధీ షేర్ చేసిన నేపథ్యంలో నేషనల్ కమిషనర్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్(ఎన్సీపీసీఆర్) ట్విట్టర్ కు నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ట్విట్టర్ రాహుల్ గాంధీ ఖాతాను తాత్కాలికంగా లాక్ చేసింది.
మైనర్ బాధితుల పట్ల గోప్యతను పాటించాలని జువైనల్ జస్టిస్ లా చెబుతోందని నేషనల్ కమిషనర్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ ఈ సందర్భంగా పేర్కొంది. కాగా, అత్యాచారం, హత్యకు గురైన 9ఏళ్ల బాలిక తల్లిదండ్రుల ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకే తాము రాహుల్ గాంధీ ట్విట్టర్ ఖాతాను తాత్కాలికంగా నిలిపివేసినట్లు పేర్కొంది. ఆ ట్వీట్ను తాము తొలగించినట్లు హైకోర్టుకు ట్విట్టర్ తెలిపింది. కాగా, రాహుల్ గాంధీకి మద్దతుగా ఆయన సోదరి ప్రియాంక గాంధీతోపాటు ఇతర కాంగ్రెస్ నేతలు తమ ట్విట్టర్ డీపీలో రాహుల్ గాంధీ పొటోను పెట్టుకున్నారు. తాజాగా, రాహుల్ గాంధీ ట్విట్టర్ ఖాతాను పునరుద్ధరించడంతో 'సత్యమేవ జయతే' అంటూ కాంగ్రెస్ పార్టీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది.












Click it and Unblock the Notifications