రెండు ఆర్ టీసీ బస్సులు ఢీ: ముగ్గురు మహిళా టీచర్లతో సహ నలుగురి దుర్మరణం!
బెంగళూరు: రెండు కేఎస్ఆర్ టీసీ బస్సులు వేగంగా ఎదురెదురుగా ఢీకొనడంతో ముగ్గురు మహిళా ఉపాధ్యాయులతో పాటు డ్రైవర్ దుర్మరణం చెందిన ఘటన కర్ణాటకలోని కలబురగి జిల్లాలోని జీవర్గి సమీపంలో జరిగింది. ప్రమాదంలో మరణించిన వారిలో ముగ్గురు ప్రభుత్వ మహిళా ఉపాధ్యాయులు ఉన్నారు.
శనివారం ఉదయం దావణగెరె నుంచి కేఎస్ఆర్ టీసీ బస్సు జీవర్గికి బయలుదేరింది. శనివారం ఉదయం జీవర్గి నుంచి యాడ్రమి ప్రాంతానికి కేఎస్ఆర్ టీసీ బస్సు బయలుదేరింది. మార్గం మధ్యలో జీవర్గి తాలుకా క్రీడా మైదానం సమీపంలోని జాతీయ రహదారిలో రెండు బస్సులు ఎదురెదురుగా ఢీకొన్నాయి.
ఈ ప్రమాదంలో కేఎస్ఆర్ టీసీ బస్సు డ్రైవర్ తో పాటు ప్రభుత్వ పాఠశాలల మహిళా ఉపాధ్యాయులు ఆయేషా సిద్దిఖి, సహారా కలతూన్, ఫరీనా బేగం సంఘటనా స్థలంలోనే దుర్మరణం చెందారు. 10 మందికి పైగా తీవ్రగాయాలు కావడంతో జీవర్గి, కలబురిగి ఆసుపత్రులకు తరలించారు. తీవ్రగాయాలైన వారి పరిస్థితి విషమంగా ఉందని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసులు చెప్పారు. బస్సులు అతివేగంగా నడపడం వలనే ప్రమాదం జరిగిందని పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది.