యూపీలో మరో దారుణం-దళిత అక్కాచెల్లెళ్లను చెట్టుకు ఉరేసిన వైనం-యోగీ సర్కార్ పై విపక్షాల ఫైర్
యూపీలో డబుల్ ఇంజన్ సర్కార్ తో నేరాలు అరికట్టేశామంటూ గొప్పులు చెప్పుకునే యోగీ సర్కార్ హయాంలోనే మరో దారుణం చోటు చేసుకుంది. ఇప్పటికే రాష్ట్రంలోని లఖీంపూర్ ఖేరీలో రైతులపై కారు పోనిచ్చి కేంద్రమంత్రి కుమారుడు చేసిన అరాచకం మర్చిపోకముందే .. అదే ప్రాంతంలో ఇద్దరు దళిత అక్కాచెల్లెళ్లను ఉరేసిన ఘటన కలకలం రేపుతోంది.
ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీలో బుధవారం ఇద్దరు దళిత టీనేజ్ అక్కాచెల్లెళ్లు చెరకు పొలంలో చెట్టుకు ఉరివేసుకుని కనిపించారు. లఖింపూర్ ఖేరీ జిల్లా నిఘాసన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లాల్పూర్ మజ్రా తమోలి పూర్వా గ్రామంలో చెట్టుకు వేలాడుతూ మృతదేహాలు కనిపించాయి. వారి మృతదేహాలపై ఎలాంటి గాయాలు కనిపించలేదని, పోస్ట్మార్టం తర్వాత మరణానికి గల ఖచ్చితమైన కారణం తెలుస్తుందని లక్నో రేంజ్ ఐజి లక్ష్మీ సింగ్ తెలిపారు.
అయితే ఇద్దరు బాలికల కుటుంబ సభ్యులు తమను హత్య చేశారని, పక్క గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు తమను అపహరించి హత్య చేశారని ఆరోపించారు. ఈ కేసులో ఇప్పటి వరకు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పోస్ట్ మార్టం తర్వాత మరిన్ని విషయాలు బయటికొస్తాయని పోలీసులు వెల్లడించారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం గ్రామంలో భారీ పోలీసు బలగాలను మోహరించారు. మరోవైపు సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రాలు ఈ ఘటనపై మండిపడ్డారు. యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంపై రాష్ట్రంలో మహిళలపై నేరాల్ని అడ్డుకోలేకపోతోందంటూ విమర్శలు ఎక్కుపెట్టారు. ఈ జంట మరణాలను హత్రాస్ గ్యాంగ్ రేప్, హత్యతో వారు పోల్చారు.