2లక్షల షెల్ కంపెనీలపై నిఘా: రూ.4,550కోట్లు డిపాజిట్, వెంటనే విత్ డ్రా
పెద్ద నోట్ల రద్దు తర్వాత పెద్ద మొత్తంలో నగదు డిపాజిట్లు చేసిన వారికి సంబంధించిన సమాచారాన్ని 13 బ్యాంకులు అందజేసినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు అనంతరం జరిగిన పరిణామాల్లో మరో సంచలన విషయం వెలుగు చూసింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత పెద్ద మొత్తంలో నగదు డిపాజిట్లు చేసిన వారికి సంబంధించిన సమాచారాన్ని 13 బ్యాంకులు అందజేసినట్లు తాజాగా కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. దాదాపు 5,800 అనుమానాస్పద కంపెనీల నుంచి అధికమొత్తంలో డిపాజిట్లు చేయడాన్ని బ్యాంకు అధికారులు గుర్తించారు.
కాగా, 5,800 డొల్ల కంపెనీలకు చెందిన 13,140 బ్యాంకు ఖాతాల్లో దాదాపు రూ.4574కోట్లు డిపాజిట్ అయ్యాయి. అయితే.. ఆ వెంటనే అందులో నుంచి రూ.4,552కోట్లను విత్డ్రా చేసినట్లు కేంద్రం వెల్లడించింది. ఇప్పటికే కంపెనీ ఆఫ్ రిజిస్ట్రర్(ఆర్వోసీ) దాదాపు 2,09,032 షెల్(డొల్ల) కంపెనీల బ్యాంకు ఖాతాలను నిలిపివేసింది.
ఒక కంపెనీకి అత్యధికంగా 2,134 బ్యాంకు ఖాతాలు ఉండగా.. మరికొన్నింటికి 900, 300 ఖాతాలు ఉన్నాయి. ఎక్కువ కంపెనీలకు 100కు పైగా బ్యాంకు ఖాతాలు ఉన్నాయని కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ తెలిపింది. కొన్ని కంపెనీల బ్యాంకు ఖాతాల్లో అప్పులు కూడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
ఈ ఖాతాల నుంచి కోట్లలో నగదు జమ కావడం, విత్డ్రా చేయడం జరిగినట్లు గుర్తించారు. ఈ క్రమంలో డొల్ల కంపెనీలను గుర్తించి వాటిపై కఠినమైన చర్యలు తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలను వేగవంతం చేసింది.