మానవత్వాన్ని కాపాడేందుకు రెండు మేడిన్ ఇండియా వ్యాక్సిన్లు రెడీ- ప్రధాని మోడీ
కరోనా మహమ్మారి ప్రభావం మొదలయ్యాక భారత్ విదేశాల నుంచి మాస్కులు, పీపీఈ కిట్లు, వెంటిలేటర్లు, కరోనా కిట్లు దిగుమతి చేసుకుందని, కానీ చివరికి రెండు మేడిన్ ఇండియా వ్యాక్సిన్లు తయారు చేసి మానవత్వాన్ని కాపాడేందుకు సిద్ధంగా ఉందని ప్రధాని మోడీ ఇవాళ సంతోషం వ్యక్తం చేశారు.
16వ ప్రవాసీ భారతీయ దివస్ను వర్చువల్ విధానంలో ప్రారంభించిన ప్రధాని మోడీ... భారత్ గొప్పదనంపై మాట్లాడారు. ఒకప్పుడు కరోనా సామాగ్రిని విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న భారత్ ఇప్పుడు.. స్వయం సమృద్ధిని సాధించిందని ప్రధాని తెలిపారు. భారత్లో పేదరిక నిర్మూల కోసం కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను అంతర్జాతీయ సమాజం కూడా చర్చించుకుంటోందని మోడీ పేర్కొన్నారు. భారత్ ఎప్పుడైతే తీవ్రవాదానికి వ్యతిరేకంగా గట్టిగా నిలబడిందో అప్పడు ప్రపంచ దేశాలు కూడా తమ బాటలోనే సాగుతున్నాయని మోడీ గుర్తుచేశారు.
Recommended Video
భారత్లో అవినీతిని అరికట్టేందుకు టెక్నాలజీ సాయం తీసుకుంటున్నట్లు మోడీ తెలిపారు. ఇందుకోసం లక్షలాది మంది పేదల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు జమ చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఏఢాది కాలంగా ప్రపంచం సంక్షోభంతో కొట్టు మిట్టాడుతున్న వేళ పలు దేశాల్లో ఉన్న భారతీయులు పోషిస్తున్న పాత్రను ప్రధాని మోడీ ప్రశంసించారు. ఇది భారతీయ సంస్కృతి గొప్పదనం అన్నారు. భారతీయులపై అంతర్జాతీయంగా నమ్మకం పెరుగుతుందనడానికి తాజా పరిణామాలే నిదర్శనమని మోడీ పేర్కొన్నారు. ప్రవాసీ భారతీయ దివస్లో వర్చువల్గా పాల్గొన్న సురినామీ దేశ అధినేత చండికా ప్రసాద్ సంతోఖీని ప్రస్తావిస్తూ భారతీయుల ప్రభావం అంతర్జాతీయంగా ఏ విధంగా ఉన్నదన్న దానికి ఇదే నిదర్శనం అన్నారు.