భారత్ లోకి చొరబాటు యత్నం.. పంజాబ్ బోర్డర్ లో ఇద్దరు పాకిస్తానీలను హతమార్చిన బీఎస్ఎఫ్
భారత సరిహద్దుల్లో భద్రతా దళాలకు కంటిమీద కునుకు ఉండడంలేదు. ఎప్పుడు ఎక్కడ నుంచి ఏ ఉపద్రవం వచ్చి పడుతుందో అర్థం కాని పరిస్థితి ఉంది. ఒకవైపు వాయు మార్గాన వస్తున్న డ్రోన్లను కట్టడి చేయడమే కాకుండా, మరోవైపు భూగర్భ మార్గంలో, సొరంగాలను ఏర్పాటు చేసుకొని భారత్ లోకి అక్రమంగా చొరబడుతున్న ఉగ్రవాదులను కట్టడి చేయడం పెద్ద కష్టంగా మారుతోంది. ఇక సరిహద్దు రేఖ వెంబడి చొరబాటు యత్నాలు సరేసరి.
భారతదేశ సరిహద్దుల్లో నిత్యం ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంటూనే ఉంటుంది. ఒకపక్క డ్రోన్ల దాడులను ఎదుర్కొంటున్న భారత్, మరోపక్క చొరబాటుదారులను కట్టడి చేయడానికి కష్టపడుతోంది. నిత్యం ఇండియా పాకిస్తాన్ బోర్డర్ లో ఎక్కడో ఒకచోట చొరబాటు యత్నాలో, డ్రోన్లను ఎగరవేయడమో జరుగుతూనే ఉంది. ఇక తాజాగా పాకిస్తాన్, భారత సరిహద్దుల్లో పంజాబ్ వద్ద శుక్రవారం రాత్రి 11 గంటలకు తార్న్ తరణ్ జిల్లాలోని భిఖివింద్ సబ్ డివిజన్ ఖల్రా గ్రామం సమీపంలో పాకిస్తాన్ నుండి భారత భూభాగంలోకి ప్రవేశించిన ఇద్దరు చొరబాటుదారులను సరహద్దు భద్రతా దళం కాల్చి వేసింది.
జమ్మూలో డ్రోన్ కూల్చివేత .. 5 కిలోల పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్న ఎన్ఎస్జి
Recommended Video
బిఎస్ఎఫ్ యొక్క 103 బెటాలియన్ సిబ్బంది రాత్రి 11 గంటల సమయంలో థె కలాన్ బోర్డర్ అవుట్ పోస్ట్ (బిఒపి) సమీపంలో భారత వైపు ముళ్ల కంచె మరియు జీరో లైన్ మధ్య అనుమానాస్పదంగా కదలికను గమనించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. బిఎస్ఎఫ్ దళం హెచ్చరిస్తున్నా చొరబాటుదారులు లొంగిపోయే బదులు పాకిస్తాన్ వైపు తిరిగి పారిపోవడానికి ప్రయత్నించారు. దీంతో బిఎస్ఎఫ్ జవాన్లు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు చొరబాటుదారులు అక్కడికక్కడే మరణించారు. వారి వద్ద నుండి రెండు బ్యాగ్స్ స్వాధీనం చేసుకున్నారు. వారు ఎవరు అన్నదానిపై భద్రతా దళాలు విచారణ జరుపుతున్నారు. ఇంకా వీరితో పాటు ఎవరైనా వచ్చారా అని ప్రస్తుతం ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.