మోడీ హవా, సర్కారు ఎన్డీయేదే: 13సీట్ల దూరంలో పీఠం
న్యూఢిల్లీ: రానున్న సార్వత్రిక ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి 259 స్థానాల వరకు గెలుచుకొని అధికారం దిశగా అడుగులు వేయనుందట. ఎన్డీటివి తాజా సర్వేలో ఇది వెల్లడైంది. సర్వే ప్రకారం.. నరేంద్ర మోడీ నాయకత్వంలో బిజెపి బలం మరింతగా పెరిగినట్లు తెలిసింది. ప్రస్తుత ఎన్నికల అనంతరం బిజెపి 214 సీట్లతో అతి పెద్ద పార్టీగా అవతరించనుందని ఈ అధ్యయనంలో తేలింది.
ఎన్డీటీవీ గత ఫిబ్రవరిలో నిర్వహించిన సర్వేలో ఆ పార్టీకి 195 లోకసభ స్థానాలు వస్తాయని వెల్లడైంది. కాంగ్రెస్ పార్టీ 104 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి ఉంటుంది. ఉత్తరప్రదేశ్లో బిజెపికి మెరుగైన ఫలితాలు వస్తాయని అక్కడి 80 సీట్లలో ఆ పార్టీ 53 లోకసభ స్థానాలను సాధిస్తుందని తెలిపింది. కాంగ్రెస్, ఆర్ఎల్డీలు 7 స్థానాల్లో మాత్రమే గెలువనున్నాయి.
గత అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించిన రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లలోనూ బిజెపి విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొంది. పశ్చిమ బెంగాల్లోని 42 సీట్లలో తృణమూల్ కాంగ్రెస్ 28 స్థానాలలో గెలుస్తుందని, అదే రీతిలో తమిళనాడులోనూ జయలలిత నేతృత్వంలోని అన్నాడిఎంకె మొత్తం 39 లోకసభ స్థానాలలో 25 సీట్లలో విజయం సాధిస్తుందని తాజా సర్వేలో తేలింది.
ఒక్క అసోంలో మాత్రమే కాంగ్రెస్ పరిస్థితి మెరుగ్గా ఉందని, అక్కడి 14 లోకసభ సీట్లలో 11 స్థానాలలో ఆ పార్టీ గెలుస్తుందని పేర్కొంది. కాంగ్రెసుకు 104 సీట్లు, ఆ పార్టీ నేతృత్వంలోని యూపిఏకి 123 సీట్లు రానున్నాయని సర్వేలో తేలింది. ఎన్డీయే, యూపిఏతర పక్షాలకు 161 సీట్లు దక్కనున్నాయి.
పార్లమెంటులో 543 లోకసభ స్థానాలు ఉన్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సీట్లు 272. ఈ సీట్లకు బిజెపి 13 అడుగుల దూరంలో ఉంది. అయితే, రోజు రోజుకు బిజెపి ఇమేజ్ పెరుగుతోందని సర్వేల ద్వారా తెలుస్తోంది. తొలుత రెండు వందల లోపు, ఆ తర్వాత రెండు వందలకు పైగా, నిన్నటి వరకు 240 స్థానాల వరకు అని సర్వేల్లో తేలింది. ఇప్పుడు 259 సీట్లు వస్తాయని తేలింది. మరింత పుంజుకుంటే ఎన్డీయే అధికారంలోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది.