సౌతాఫ్రికా నుంచి బెంగళూరుకు ఇద్దరు ప్రయాణికులు: వారిద్దరికీ కరోనా పాజిటివ్, కానీ ఓమిక్రాన్ కాదు
బెంగళూరు: దక్షిణాఫ్రికా నుంచి బెంగళూరుకు వచ్చిన ఇద్దరు ప్రయాణికులకు కరోనావైరస్ పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. అయితే, వారికి సోకిన కరోనా వేరియంట్ డెల్టా అని, దక్షిణాఫ్రికాలో భయంకరంగా వ్యాపిస్తున్న ఓమిక్రాన్ కాదని వైద్యులు స్పష్టం చేశారు.
కర్ణాటక స్టేట్ హెల్త్ సెక్రటరీ టీకే అనిల్ కుమార్ మాట్లాడుతూ.. సీక్వెన్సింగ్ ప్రక్రియను వేగవంతం చేశామని తెలిపారు. ఇద్దరి నమూనాలు కూడా డెల్టా వేరియంట్ అని తేలింది. ఓమిక్రాన్ కాదు. నవంబర్ నెలలోనే సౌత్ ఆఫ్రికా నుంచి తిరిగి వచ్చారని చెప్పారు. బెంగళూరు ల్యాబ్ లోనే సీక్వెన్సింగ్ చేసినట్లు తెలిపారు. కాగా, కొద్ది వారాల్లో సుమారు 94 మంది దక్షిణాఫ్రికా జాతీయులు కర్ణాటకకు రావడం గమనార్హం.
కొత్తగా కనుగొనబడిన బీ.1.1529 కరోనావైరస్ వేరియంట్, ఓమ్నిక్రాన్ అని పేరు పెట్టబడింది, దీనిని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) శుక్రవారం 'ఆందోళనకర వేరియంట్'గా అభివర్ణించింది.
మరోవైపు, ప్రపంచ వ్యాప్తంగా కరోనావైరస్ మహమ్మారి కొత్త వేరియంట్ ఓమిక్రాన్ తో తీవ్ర ఆందోళన చెందుతోంది. తాజాగా, బ్రిటన్లో తొలి రెండు ఓమిక్రాన్ కరోనా వేరియంట్ కేసులు వెలుగు చూశాయి. ఓమిక్రాన్ సోకిన ఇద్దరూ కూడా సౌత్ ఆఫ్రికా నుంచి తిరిగి వచ్చినవారే కావడం గమనార్హం.
ఓమిక్రాన్ వేరియంట్ బారినపడిన ఇద్దరినీ సెల్ఫ్ అసోలేషన్లో ఉంచామని, కాంటాక్ట్ ట్రేసింగ్ జరుపుతున్నామని ఆ దేశ హెల్త్ సెక్రటరీ సాజిద్ జావిద్ తెలిపారు.
కాగా, ఈ కొత్త వేరియంట్ మరోసారి ప్రపంచాన్ని వణికిస్తోంది. ఒమిక్రాన్ వేరియంట్, డెల్టా కంటే ప్రమాదకరమైందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ విషయమై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఇక కొత్త వేరియంట్పై కేంద్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. ఇందులో భాగంగానే అత్యున్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించిన ప్రధాని మోడీ.. అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలకు సూచించారు. దీంతో రాష్ట్రాలు కూడా సౌతాఫ్రికా తోపాటు ఇతర దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల పట్ల అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి.