పంజాబ్ లో అనుమానిత ఉగ్రవాదులు: అలర్ట్
చండీగడ్: పంజాబ్ లో మరో ఇద్దరు ఉగ్రవాదులను తాను చూశానని ప్రత్యక్ష సాక్షి అధికారులకు సమాచారం ఇవ్వడంతో అప్రమత్తం అయ్యారు. ఇద్దరు ఉగ్రవాదులు పంజాబ్ లోని మిలటరీ స్థావరం గురించి వివరాలు అడిగారని టిబ్రికి చెందిన లవ్ ప్రీత్ సింగ్ అనే యువకుడు అధికారులకు చెప్పాడు.
విషయం తెలుసుకున్న మిలటరీ అధికారులు, పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. టిబ్రికి సమీపంలోనే మిలటరీ స్థావరం ఉండటంతో పోలీసు అధికారులు పలు కోణాలలో దర్యాప్తు చేస్తున్నారు.
తాను బైక్ లో వెలుతున్న సమయంలో పందేర్ గ్రామం దగ్గర ఇద్దరు వ్యక్తులు తనను ఆపారని లవ్ ప్రీత్ సింగ్ అధికారులకు చెప్పాడు. వారిద్దరూ మిలటరీ దుస్తుల్లోనే ఉన్నారని, చేతిలో ఆయుధాలు ఉన్నాయని లవ్ ప్రీత్ సింగ్ అంటున్నాడు.
ఇక్కడ మిలటరీ స్థావరం ఎక్కడ ఉంది అంటూ పూర్తి వివరాలు అడిగారని, వారి బాష అర్థం కాకపోవడంతో తాను భయంతో పారిపోవడానికి ప్రయత్నించానని, ఓ వ్యక్తి నా భుజం మీద చెయ్యివేసి అడిగిన దానికి సమాధానం చెప్పాలని బెదిరించాడని అధికారులకు సమాచారం ఇచ్చాడు.
అధికారులు లవ్ ప్రీత్ సింగ్ ను సంఘటనా స్థలానికి పిలుచుకుని వెళ్లి విచారణ చేశారు. అంతకు ముందు ఇద్దరు వ్యక్తులు తాము చెరుకు తోటలో ఇద్దరు అనుమానాస్పద ఉగ్రవాదులను చూశామని అధికారులకు చెప్పారు. పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై ఉగ్రవాదులు దాడి చేసిన తరువాత ఇలాంటి విషయాలు వెలుగు చూడటంతో అధికారులు అప్రమత్తం అయ్యారు.