ఢిల్లీ సరిహద్దుల్లో కలకలం- రైతుల టెంట్లకు నిప్పు- పలు అనుమానాలు
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో కొన్ని నెలులుగా రైతులు ఆందోళనలు చేస్తున్నారు. ప్రస్తుతం ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఢిల్లీ నుంచి కేంద్రంలో పెద్దలు, మంత్రులు ప్రచారం కోసం అక్కడికి వెళ్లినా సరిహద్దుల్లో మాత్రం రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం కొందరు అగంతకులు రైతుల టెంట్లకు నిప్పుపెట్టారు.
A tent of farmers set on fire by unidentified people at Singhu border.
— Selvam k (@Selvam7121983) April 15, 2021
A car and other belongings of farmers burnt. pic.twitter.com/ylx06ACPJ8
ఢిల్లీలోని సింఘూ సరిహద్దుల్లో రైతుల్ని అడ్డుకునేందుకు పోలీసులు భారీ గోడలు నిర్మించి, కంచెలు వేసి నిరంతరం పహారా కాస్తున్నారు. అయితే ఇవాళ ఉదయం హఠాత్తుగా అక్కడికి చేరుకున్న కొందరు అగంతకులు రైతుల టెంట్లకు నిప్పుపెట్టారు. సమయానికి రైతులు అక్కడ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. టెంట్లలో రైతులు తెచ్చుకున్న సామాగ్రితో పాటు ఫర్నిచర్ కూడా దగ్ధమైంది. పోలీసులు సకాలంలో చేరుకుని పరిస్ధితిని అదుపులోకి తెచ్చారు.
మధ్యాహ్నం 12 గంటల సమయంలో తమ టెంట్ల వద్దకు ఓ అగంతకుడు వచ్చాడని, వెంటనే అక్కడున్న ఓ టెంట్కు నిప్పు పెట్టాడని, రైతులు వెంటనే పరుగులు తీసి దాన్ని ఆర్పే లోపే మరో టెంట్కు కూడా నిప్పు పెట్టాడని ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపారు. వెంటనే అతన్ని పట్టుకునేందుకు రైతులు పరుగులు తీసినా తప్పించుకుని పారిపోయాడు. దీనిపై స్ధానిక కుండ్లీ పోలీసు స్టేషన్లో రైతులు ఫిర్యాదు చేశారు. టెంట్లు తగులబెట్టేందుకు వచ్చిన వ్యక్తి బీఆర్టీఎస్ వైపు నుంచి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు.