ఇద్దరు మహిళలపై గ్యాంగ్రేప్: దాడిలో ఒకరి మృతి
కోల్కతా: ఇద్దరు వివాహిత మహిళలపై నలుగురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తీవ్రంగా దాడికి గురవ్వడంతో ఓ బాధితురాలు ఘటనా స్థలంలోనే మృతి చెందింది. ఈ దారుణ ఘటన పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని మాల్డాలో చోటుచేసుకుంది.
బ్రాహ్మణ్గ్రామ్ గ్రామానికి చెందిన ఇద్దరు వివాహిత మహిళలు తమ బంధువుల ఇంటికి వెళ్తుండగా నలుగురు దుండగులు వారిని అపహరించుకుపోయారు. జనసంచారం లేని ప్రాంతానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారం చేశారు.
ఓ బాధితురాలు దారుణాన్ని తీవ్రంగా ప్రతిఘటించింది. దీంతో దుండగులు ఆమెపై పైశాచికంగా దాడిచేశారు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. మరో బాధితురాలు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది.
అనంతరం దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. స్పృహలోకి వచ్చిన రెండో బాధితురాలు ఇంటికి చేరుకుని జరిగిన విషయాన్ని వివరించింది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుల కోసం గాలిస్తున్నారు.