సౌదీలో దీనావస్థ: 8నెలలు తిండిలేక టెర్రాస్పై నరకం చూశాడు
దుబాయి: సౌదీలో భారతీయుల కష్టాలు అన్నీఇన్నీ కావు. తాజాగా మరో భారతీయుడి దీనగాథ వెలుగుచూసింది. జీతం ఇవ్వకుండా, పాస్పోర్ట్ స్వాధీనం చేసుకున్న యజమాని.. ఆ నిరుద్యోగిని ఆహారం కూడా సరిగా పెట్టకుండా భవనం టెర్రాస్పై బంధించాడు. ఇలా దాదాపు 8నెలలుగా అతడు ఆకలితో అలమిటిస్తున్నాడు.
యూఏఈలో చోటు చేసుకున్న ఈ ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. కేరళలోని కొల్లాంకు చెందిన సంజీవ్ రాజన్ అనే ఎలక్ట్రిషియన్ ఉద్యోగం కోసం దుబాయి వచ్చాడు. అతని భార్య, ఇద్దరు పిల్లలు మాత్రం స్వగ్రామంలోనే అతని తల్లిదండ్రులతో ఉండిపోయారు.
కాగా, అతడ్ని బంధించిన యజమాని కూడా భారతీయుడే కావడం గమనార్హం. పాస్ పోర్ట్ ఇవ్వకపోవడంతో విధిలేని పరిస్థితిలో సంజీవ్ అజ్మన్లోని యజమాని భవనంపైనే ఉంటున్నాడు. తనకు ఇంకా డబ్బులు చెల్లించాలని యజమాని అతడ్ని బంధించాడని ఖలీజ్ టైమ్స్ పేర్కొంది.
ఖలీజ్ టైమ్స్ కథనం ప్రకారం.. షార్జాలోని ఓ నిర్మాణ కంపెనీలో పనిచేసే సంజీవ్.. దాదాపు 236 రోజులపాటు తాను భవనం టెర్రాస్ పైనే గడిపినట్లు తెలిపాడు. తన వద్ద డబ్బు లేకపోవడం, ఎక్కడ గది దొరక్కపోవడంతో ఎండాకాలంలో కూడా టెర్రాస్ పైనే ఉండాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశాడు. తాను కొందరు కార్మికులు, షాప్ ఓనర్ల సహకారంతో ఇక్కడ్నుంచి బయటపడినట్లు తెలిపాడు.
'తనను దయచేసి ఇంటికి పంపించండి. లేదా నేను ఇక్కడే చనిపోతాను. నా వద్ద డబ్బు, ఆహారం లేదు, నివాసం కూడా లేదు. రెండేళ్ల నుంచి కంపెనీ ఏర్పాటు చేసిన గదిలో ఉంటున్నా. నా కంట్రాక్ట్ గత మార్చిలో ముగియడంతో నేను ఇంటికి వెళ్లాలనుకుంటున్నా. నెలకు రూ. 16,761లకు పని చేశాను, నేను అనుకున్నంత జీతం ఇవ్వలేదు' అని చెప్పారు.
కానీ, తమ యజమాని మాత్రం తనను ఇంటికి పంపించడం లేదని, తన జీతం కూడా నిలిపేశాడని సంజీవ్ తెలిపాడు. అంతేగాక, తాను పారిపోయనని, తనపై కేసు కూడా పెట్టాడని చెప్పాడు. మార్చి 21నే సంజీవ్ను కంపెనీ నుంచి పంపించినా.. అతనికి రావాల్సిన జీతం ఇవ్వలేదు. అంతేగాక, లేబర్ కోర్టు, ఇండియన్ కాన్సులేట్, కమ్యూనిటీ అసోసియేషన్స్ను ఆశ్రయించినప్పటికీ ప్రయోజనం లేకపోయిందని వాపోయాడు సంజీవ్.
పంజాబ్కు చెందిన యజమాని.. అధికారులు చెప్పడంతో పాస్ పోర్ట్ ఇచ్చేందుకు ఒప్పుకున్నాడని, వారు వెళ్లిన తర్వాత తనకు పాస్ పోర్ట్ ఇవ్వలేదని చెప్పాడు. కాగా, సంజీవ్కు సంబంధించిన కథనం మీడియాల్లో రావడంతో పలువురు అతనికి విమాన టికెట్ల ఇప్పిస్తామని, జాబ్ ఇప్పిస్తామని ముందుకు వచ్చారు.