వాట్సాప్ లో నుపుర్ శర్మ పెట్టుకున్నాడని చంపేశారు-ఉదయ్ పూర్ లో టైలర్ హత్య-ఉద్రిక్తతలు
వాట్సాప్ లో వివాదాస్పద మాజీ బీజేపీ నేత నుపుర్ శర్మ ఫొటోను స్టేటస్ పెట్టుకున్న ఓ టైలర్ ను దారుణంగా హత్య చేసిన ఘటన రాజస్తాన్ లోని ఉదయ్ పూర్ లో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఇవాళ ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చి నిరసనలకు దిగడంతో సీఎం అశోక్ గెహ్లాట్ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.
పట్టపగలు చోటు చేసుకున్న టైలర్ హత్య రాజస్థాన్లోని ఉదయ్పూర్లో విషాదాన్ని నింపింది. హత్యకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయడంతో దుకాణాలు మూసేశారు. పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో సీఎం అశోక్ గెహ్లాట్ సంయమనం పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వీడియోలో కనిపించిన దాడి చేసిన నిందితుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ పరిస్థితి బాధాకరమైనది, అవమానకరమైనదని గెహ్లాట్ తెలిపారు. ఈ సంఘటనతో ప్రమేయం ఉన్న నేరస్థులందరిపై కఠిన చర్యలు తీసుకుంటారని, పోలీసులు గాలింపు చేపట్టారని, శాంతిని కాపాడాలని అశోక్ గెహ్లాట్ అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేశారు.
ఈ హత్య వీడియోను షేర్ చేయడం ద్వారా రాష్ట్రంలో శాంతియుత వాతావరణాన్ని పాడుచేయవద్దని అందరికి సీఎం గెహ్లాట్ విజ్ఞప్తి చేశారు. మీరు వీడియోను షేర్ చేస్తే దాని ద్వారా సమాజంలో ద్వేషాన్ని వ్యాప్తి చేయాలనే నేరస్థుడి ఉద్దేశ్యం నెరవేరుతుందన్నారు. హత్య రెండు వర్గాల నుండి ఉద్రేకపూరిత సోషల్ మీడియా పోస్ట్లతో ఉద్రిక్తతలు తలెత్తాయి.