ఇథనాల్ వాహనదారులకు కేంద్రం బిగ్ షాక్-సుప్రీంలో గుట్టు రట్టు..!
20 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్ (Ethanol Blending) విషయంలో కేంద్రం వాహనదారులకు ఇవాళ భారీ షాకిచ్చింది. ప్రస్తుతం 20 శాతం నుంచి 85 శాతం వరకూ ఇథనాల్ కలిపిన వాహనాల్ని ప్రారంభించేందుకు అనుమతులు ఇచ్చేస్తుున్న కేంద్రం.. మరోవైపు ఇవాళ సుప్రీంకోర్టులో మాత్రం దీని గుట్టు విప్పేసింది. ఇథనాల్ బ్లెండింగ్ అనేది ఇంకా ప్రయోగ దశలోనే ఉందని, దీని ప్రభావం వచ్చే ఏడాది నాటికి స్పష్టమవుతుందని సుప్రీంకోర్టుకు తెలిపింది.
2025-26 సరఫరా సంవత్సరానికి సంబంధించి ఇథనాల్ కేటాయింపు విషయంలో కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ దాఖలు చేసిన పిటిషన్పై వాదనల సందర్భంగా అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి ఈ విషయాన్ని కోర్టుకు తెలిపారు. పెట్రోల్లో 20 శాతం ఇథనాల్ను కలపాలనే ప్రభుత్వ లక్ష్యంపై హైకోర్టు ఆదేశం ప్రభావం చూపవచ్చని బీపీసీఎల్ తన పిటిషన్లో వాదించింది.

ఇథనాల్ సరఫరా ఒప్పందాలు అక్టోబర్ 2025 నాటికే ఖరారయ్యాయని, ఇలాంటి పిటిషన్లు అనేక హైకోర్టుల ముందు పెండింగ్లో ఉన్నాయని ఏజీ కోర్టుకు తెలిపారు. ఇది జాతీయ విధానంపై ప్రభావం చూపుతుందన్నారు. ఇథనాల్ సరఫరా ఒప్పందాల పునరుద్ధరణ జరగాల్సిన అక్టోబర్ నెలలోపు ఈ అంశంపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందని వాదిస్తూ, కేసును బదిలీ చేయాలని కోరే పిటిషన్ను దాఖలు చేయడానికి వెంకటరమణి అనుమతి కోరారు.

ఓవైపు ఇథనాల్ కలిపిన పెట్రోల్ వాడకం వల్ల ఇంధన భద్రత, రైతులు, పర్యావరణానికి మేలు జరుగుతుందని ఊదరగొడుతున్న కేంద్రం.. ఇవాళ దీన్ని కేవలం ప్రయోగాత్మక దశలోనే ఉందని సుప్రీంకోర్టుకు చెప్పడం చర్చనీయాంశంగా మారింది. నిర్ణీత గడువు కంటే ఐదేళ్ల ముందే, అంటే గత ఏడాదే పెట్రోల్లో 20 శాతం ఇథనాల్ను కలిపే లక్ష్యాన్ని భారత్ సాధించింది. ఏప్రిల్ 1 నుండి చమురు మార్కెటింగ్ కంపెనీలు దేశవ్యాప్తంగా ఇథనాల్ కలిపిన పెట్రోల్ను సరఫరా చేయడం ప్రారంభించాయి.ఇప్పుడు ప్రభుత్వం 2030 నాటికి పెట్రోల్లో ఇథనాల్ బ్లెండింగ్ను 30 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది.













Click it and Unblock the Notifications