సనాతన ధర్మాన్ని అంతం చేయాల్సిందే.. మళ్లీ కెలికిన ఉదయనిధి స్టాలిన్ !!
తమిళనాడు రాజకీయాల్లో మరోసారి సనాతన ధర్మం అంశం తీవ్ర చర్చకు దారితీసింది. డీఎంకే ఎమ్మెల్యే, ప్రముఖ నాయకుడు ఉదయనిధి స్టాలిన్ శాసనసభ వేదికగా మరోసారి తన వివాదాస్పద వ్యాఖ్యలను పునరావృతం చేయడంతో రాజకీయ వర్గాల్లో వేడి పెరిగింది. గతంలో "సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి" అంటూ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఆ వ్యాఖ్యలపై బీజేపీ సహా పలు హిందూ సంస్థలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. అయినప్పటికీ, తన వైఖరిలో ఎలాంటి మార్పు లేదని తాజా అసెంబ్లీ ప్రసంగంతో ఉదయనిధి మరోసారి స్పష్టం చేశారు.
సనాతన ధర్మం అంతం కావాలి..
కాగా ఈరోజు (మంగళవారం, మే 12 ) తమిళనాడు శాసనసభలో జరిగిన చర్చ సందర్భంగా ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ.. "మనుషుల మధ్య కుల, సామాజిక విభేదాలను పెంచే సనాతన ధర్మం నిర్మూలించాల్సిందే" అని వ్యాఖ్యానించారు. సమాజంలో సమానత్వం నెలకొనాలంటే ఇలాంటి భావజాలాలను వ్యతిరేకించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. తమిళనాడులో డీఎంకే ప్రభుత్వం ఎప్పటి నుంచో సామాజిక సమానత్వాన్ని ప్రోత్సహిస్తోందని.. అదే తమ రాజకీయ తత్వమని చెప్పారు.

గత వ్యాఖ్యలతో దేశవ్యాప్తంగా వివాదం..
ఉదయనిధి స్టాలిన్ గతంలో చేసిన "సనాతన ధర్మం డెంగ్యూ, మలేరియా లాంటిది.. దాన్ని నిర్మూలించాలి" అన్న వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా రాజకీయ దుమారానికి కారణమయ్యాయి. ఆ వ్యాఖ్యలపై అనేక రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి. హిందూ సంఘాలు తీవ్ర నిరసనలు వ్యక్తం చేశాయి. పార్లమెంట్ వరకు ఈ అంశం వెళ్లగా, బీజేపీ నేతలు డీఎంకే పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
అయితే ఆ వివాదం తర్వాత కూడా ఉదయనిధి తన అభిప్రాయాన్ని మార్చుకోకపోవడం ఇప్పుడు మళ్లీ చర్చనీయాంశమైంది. ఆయన తాజా వ్యాఖ్యలతో తమిళనాడు రాజకీయాల్లో మరోసారి భావజాల పోరు మొదలయ్యే అవకాశం కనిపిస్తోంది.
రాజకీయ మర్యాదలు పాటించాలని పిలుపు..
ఒకవైపు తన భావజాలాన్ని బలంగా వినిపించిన ఉదయనిధి.. మరోవైపు రాజకీయ మర్యాదలు, శాసనసభ హుందాతనం కాపాడాలని సూచించడం ఆసక్తికరంగా మారింది. ఇటీవల జరిగిన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ప్రస్తావిస్తూ.. "వివిధ పార్టీల నాయకులు కొత్త ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలిపారు. అదే రాజకీయ సంస్కృతి శాసనసభలో కూడా కొనసాగాలి" అని అన్నారు. "మనం అధికార పక్షం, ప్రతిపక్షం అంటూ వేర్వేరు వరుసల్లో కూర్చున్నప్పటికీ.. తమిళనాడు అభివృద్ధి కోసం అందరం కలిసి పని చేయాలి" అంటూ సభలో ఆరోగ్యకరమైన చర్చల వాతావరణం ఉండాలని కోరారు.
రాష్ట్ర గీతం అంశంపై అభ్యంతరం..
శాసనసభలో జరిగిన మరో అంశంపై కూడా ఉదయనిధి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వందేమాతరం ఆలపించిన తర్వాత తమిళనాడు రాష్ట్ర గీతాన్ని ప్రదర్శించడం సరైన పద్ధతి కాదని ఆయన వ్యాఖ్యానించారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార వేడుకలో వందేమాతరం ఆలపించలేదని ఉదాహరణగా చెబుతూ.. "మన తమిళనాడు రాష్ట్ర గీతం ఎప్పటికీ రెండో స్థానంలో ఉండకూడదు" అని స్పష్టం చేశారు. రాష్ట్ర గౌరవానికి సంబంధించిన అంశాల్లో ప్రత్యేక శ్రద్ధ అవసరమని అధికారులకు సూచించారు.
బీజేపీ నుంచి విమర్శల వెల్లువ?
ఉదయనిధి తాజా వ్యాఖ్యలపై త్వరలోనే బీజేపీ మరియు హిందూ సంస్థల నుంచి తీవ్ర ప్రతిస్పందన వచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే తమిళనాడులో డీఎంకే-బీజేపీ మధ్య భావజాల యుద్ధం కొనసాగుతుండగా, ఇప్పుడు సనాతన ధర్మం అంశం మరోసారి రాజకీయ వేడిని పెంచింది. మరోవైపు డీఎంకే మద్దతుదారులు మాత్రం ఉదయనిధి వ్యాఖ్యలను సమర్థిస్తున్నారు. సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన మాట్లాడుతున్నారని, ద్రావిడ సిద్ధాంతాలను కొనసాగిస్తున్నారని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications