ఉద్ధవ్.. ఎన్నికల్లో ఒక్కసారి కూడా: ఎమ్మెల్యే కాదు..ఎమ్మెల్సీ కాదు: ముఖ్యమంత్రిగా: ఆరు నెలల్లో
ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా మరి కొన్ని గంటల్లో ప్రమాణ స్వీకారం చేయబోతోన్న శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే ఓ అరుదైన జాబితాలో చేరిపోయారు. శాసన సభలో గానీ, శాసన మండలిలో గానీ సభ్యత్వం లేకుండానే ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ప్రస్తుతం ఉద్ధవ్ థాకరే ఎమ్మెల్యే కాదు.. ఎమ్మెల్సీ కూడా కాదు. అయినప్పటికీ- ఆయన సారథ్యంలోనే మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పడబోతోంది.

అసెంబ్లీ ఎన్నికలకు దూరం..
కిందటి నెల ముగిసిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఉద్ధవ్ థాకరే పోటీ చేయలేదు. ఎన్నికలకు దూరంగా ఉన్నారు. తన కుమారుడు ఆదిత్య థాకరేను ఎన్నికల బరిలో దింపారు. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వర్లీ అసెంబ్లీ స్థానం నుంచి తన వారసుడిని రేసులో నిలిపారు. గెలిపించుకున్నారు. మొన్నటి ఎన్నికల్లో ఆదిత్య థాకరే ఎన్సీపీకే చెందిన డాక్టర్ సురేష్ మానేపై 67 వేలకు పైగా ఓట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.

ఒక్కసారిగా కూడా ఎన్నికల బరిలో నిల్చోని ఉద్ధవ్
ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే- రాజకీయాల్లో అరంగేట్రం చేసినప్పటి నుంచీ ఇప్పటిదాకా ఉద్ధవ్ థాకరే ఒక్కసారిగా కూడా ఎన్నికల్లో పోటీ చేయలేదు. శాసన సభకు గానీ, లోక్ సభకు గానీ.. చివరికి శాసన మండలి ఎన్నికల్లో కూడా ఆయన పోటీ చేయలేదు. తాను వెనుక ఉండి పార్టీని నడిపించడానికే ఆయన ప్రాధాన్యత ఇచ్చారు. పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడానికే తాను ఎన్నికల్లో పోటీ చేయట్లేదని పలుమార్లు చెప్పుకొన్నారు.

ఎనిమిదో ముఖ్యమంత్రిగా.. ఉద్ధవ్
మహారాష్ట్ర శాసన సభకు గానీ, శాసన మండలికి గానీ ఎన్నిక కాకుండానే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాయకుల జాబితా కాస్త పెద్దదే. ఆ జాబితాలో తాజాగా ఉద్ధవ్ థాకరే కూడా చేరిపోనున్నారు. అలా ప్రమాణ స్వీకారం చేసిన వారి జాబితాలో ఉద్ధవ్ థాకరేది ఎనిమిదో నంబర్. ఆయన కంటే ముందు- కాంగ్రెస్ నాయకులు ఏఆర్ అంతులే, వసంత్ దాదా పాటిల్, శివాజీరావు నిలంగేకర్ పాటిల్, శంకర్ రావు చవాన్, సుశీల్ కుమార్ షిండే, పృథ్వీరాజ్ చవాన్, ఒకప్పటి కాంగ్రెస్ నాయకుడు శరద్ పవార్.. ఉన్నారు. ఈ ఏడుమంది కూడా శాసనసభకు గానీ మండలికి గానీ ఎన్నిక కాకుండానే ముఖ్యమంత్రులుగా పనిచేశారు.

ఆరు నెలల్లో..
ఈ పరిస్థితుల్లో ఉద్ధవ్ థాకరే ఆరు నెలల్లోగా శాసన సభకు లేదా శాసన మండలికి ఎన్నిక కావడం అనివార్యమైంది. ఆరు నెలల్లోగా ఆయన ఏదైనా ఒక అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాల్సి ఉంటుంది. ఆయన ఏ స్థానం నుంచి పోటీ చేస్తారనేది ఇప్పుడే అంచనా వేయలేకపోవచ్చే. ప్రస్తుతం శివసేనకు 58 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. పార్టీకి అత్యంత విధేయుడిగా ఉన్న ఎమ్మెల్యేతో రాజీనామా చేయించి, ఆ స్థానంలో పోటీ చేయడం లేదా, ఎమ్మెల్సీగా ఎన్నిక కావడం ఉద్ధవ్ ముందున్న ప్రత్యామ్నాయాలు.












Click it and Unblock the Notifications