ఉద్ధవ్ థాక్రే రాజీనామా లేఖకు గవర్నర్ ఆమోదం: దేవేంద్ర ఫడ్నవీస్కు స్వీట్లు, బీజేపీ సంబరాలు
ముంబై: మహారాష్ట్ర రాజకీయ సంక్షోభానికి తెరపడినట్లే కనిపిస్తోంది. ముఖ్యమంత్రి పదవితోపాటు ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లు శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే ప్రకటించిన విషయం తెలిసిందే. గురువారం బలనిరూపణ పరీక్ష ఎదుర్కోవాలంటూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలోనే ఉద్ధవ్ థాక్రే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. దీంతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు పావులు కదుపుతోంది.
Recommended Video
సీఎం పదవికి ఉద్ధవ్ థాక్రే రాజీనామా: ఆమోదించిన గవర్నర్
ముఖ్యమంత్రి పదవితోపాటు ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన కొద్ది సేపటికే (బుధవారం రాత్రి) ఉద్ధవ్ థాక్రే భారీ కాన్వాయ్తో రాజ్ భవన్కు చేరుకున్నారు. గవర్నర్ భగత్ సింగ్ కొశ్యారీని కలిసి ఆయనకు తన రాజీనామా లేఖను సమర్పించారు ఉద్ధవ్ థాక్రే. ఆయన వెంట కుమారుడు ఆదిత్య థాక్రేతోపాటు పలువురు నేతలు ఉన్నారు. ఉద్ధవ్ రాకతో అక్కడికి భారీగా శివసేన నేతలు, కార్యకర్తలు చేరుకున్నారు. కాగా, ఉద్ధవ్ రాజీనామా లేఖను గవర్నర్ ఆమోదించారు. కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు అపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని ఉద్ధవ్ను గవర్నర్ కోరారు.
సంబరాల్లో బీజేపీ.. దేవేంద్ర ఫడ్నవీస్కు స్వీట్లు
మరోవైపు, ఉద్ధవ్ థాక్రే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసినట్లు ప్రకటించగానే.. మహారాష్ట్ర బీజేపీ కార్యాలయంలో సంబరాలు మొదలయ్యాయి. మాజీ సీఎం, సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ వద్దకు ఇతర నేతలు వచ్చి శుభాకాంక్షలు చెప్పారు. అంతేగాక, స్వీట్లు కూడా తినిపంచారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం రావడంతో బీజేపీ కార్యాలయంలో సందడి మొదలైంది.
ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ను కలవనున్న ఫడ్నవీస్
దేవేంద్ర ఫడ్నవీస్కు అనుకూలంగా నేతలు నినాదాలు చేస్తూ సందడి చేశారు. తమకు 150 మందికిపైగా ఎమ్మెల్యేల మద్దతు ఉందని, తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఇప్పటికే దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటించిన విషయం తెలిసిందే. బీజేపీకి వందకుపైగా స్థానాలుండగా, శివసేన రెబల్ నేత ఏక్ నాథ్ షిండే శిబిరంలోని సుమారు 50 ఎమ్మెల్యేల మద్దతు కూడా బీజేపీకే దక్కనుంది. ఈ నేపథ్యంలో గురువారం ఫడ్నవీస్ తోపాటు బీజేపీ నేతలు గవర్నర్ ను కలిసే అవకాశం ఉంది. ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి కోరే అవకాశం ఉంది. అంటే, కొద్ది రోజుల్లోనే మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరనుంది.