ఉద్ధవ్ థాక్రే-ఏక్ నాథ్ షిండేకు వాలంటైన్స్ డే టెస్ట్- సుప్రీంకోర్టు ఏం తేల్చబోతోంది ?
శివసేనలో ఉద్ధవ్ థాక్రే, ఏక్ నాథ్ షిండే వర్గాల మధ్య పోరు కొనసాగుతోంది. ఇప్పటికే రెండు వర్గాలు శివసేన మాదంటే మాదంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ వ్యవహారం తేల్చేందుకు అత్యున్నత న్యాయస్ధానం సిద్ధమవుతోంది. ఈ వాజ్యాల్ని విచారించేందుకు గడువు నిర్ణయించింది. థాక్రే, షిండే వర్గాలు పరస్పరం అభియోగాలతో దాఖలు చేసుకున్న పిటిషన్లపై ఇవాళ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, న్యాయమూర్తులు ఎంఆర్ షా, కృష్ణ మురారి, హిమా కోహ్లి, పిఎస్ నరసింహలతో కూడిన ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరిపింది. అనంతరం దీనిపై వచ్చే నెల 14న వాలెంటైన్స్ డే రోజును విచారిస్తామని ప్రకటించింది.
ఇవాళ జరిగిన విచారణలో థాక్రే వర్గం తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్.. ఐదుగురు సభ్యులు కాకుండా ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి ఈ పిటిషన్లను బదిలీ చేయాలని కోరారు. దీనిపై స్పందించిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం.. ఫిబ్రవరి 14న జరిగే విచారణలో ఎంతమంది సభ్యుల ధర్మాసనం ఈ పిటిషన్లను విచారించాలన్నది నిర్ణయిస్తామని తెలిపింది.

సుప్రీంకోర్టు నిర్ణయంపై స్పందించిన థాక్రే వర్గం నేత సంజయ్ రౌత్.. ప్రేమికుల రోజున తిరిగి ప్రారంభమయ్యే ఈ విచారణ ప్రేమతో జరుగుతుందంటూ సరదాగా వ్యాఖ్యానించారు. తమ వాజ్యాల విచారణ కోసం ఏడుగురు జడ్డీల ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాలన్న వినతిపై సానుకూల స్పందన వస్తుందని థాక్రే వర్గం భావిస్తోంది. మరోవైపు శివసేన సభ్యులపై జారీ చేసిన కొత్త అనర్హత నోటీసులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని మహారాష్ట్ర శాసనసభ స్పీకర్ రాహుల్ నార్వేకర్ కు సుప్రీంకోర్టు సూచించింది.












Click it and Unblock the Notifications