ఐదు రాష్ట్రాల్లో బీజేపీకి ఓటమే-మమత జోస్యం-మోడీ-షా కంటే దొంగలెవరని ప్రశ్న
పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మాటల తూటాలు పేలుతున్నాయి. మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ సర్కారుపై మాటలదాడితో రెచ్చిపోతున్న బీజేపీని అదే స్ధాయిలో ఎదుర్కొనేందుకు ఆమె వ్యూహరచన చేస్తున్నారు. మాటకు మాట అన్నట్లుగా కౌంటర్లు సంధిస్తున్నారు. దీంతో బీజేపీ నేతల విమర్శలు, మమత కౌంటర్లతో బెంగాల్ పోరు ఆసక్తికరంగా మారిపోయింది.
పశ్చిమబెంగాల్లో నిర్వహించిన బీజేపీ తొలి ప్రచార సభలో పాల్గొన్న ప్రధాని మోడీ తనపై చేసిన విమర్శలకు తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ తనదైన శైలిలో కౌంటర్లు ఇచ్చారు. ప్రధానిని అబద్ధాల కోరుగా ఆమె అభివర్ణించారు. అడ్డూ అదుపూ లేకుండా పెరుగుతున్న చమురు, గ్యాస్ ధరలను అదుపుచేయలేకపోవడంపై ప్రధాని వివరణ ఇవ్వాలని మమత డిమాండ్ చేశారు. పెట్రో ధరల మంటపై ప్రజలకు వివరణ ఇస్తారా లేక తప్పుకుంటారా అని మమతా బెనర్జీ.. ప్రధానిని ప్రశ్నించారు.

ఎన్నికలకు ముందు ఉజ్వల (అభివృద్ధి) అన్నారని, కానీ ఇప్పుడు జుమ్లా (కట్టు కథలు)కు వచ్చేశారని ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్షాను ఉద్దేశించి మమత వ్యాఖ్యానించారు. ప్రధాని బెంగాల్కు వచ్చేది అభివృద్ధి కోసం కాదని విమర్శలకోసమేనని మమత మండిపడ్డారు. యూపీ, మధ్యప్రదేశ్, గుజరాత్లో మహిళలకు మీరేం చేస్తున్నారని, బెంగాల్లో తానేం చేస్తున్నానో చూడాలని ప్రధానికి ఆమె సవాల్ విసిరారు. ఆయా రాష్ట్రాల్లో మహిళలకు మధ్యాహ్నం మూడింటికే రక్షణ లేదని ఆక్షేపించారు. కానీ పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు మాత్రం వరుసగా పెరుగుతున్నాయని మమత ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలో జరిగే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలుకాబోతోందని మమత జోస్యం చెప్పారు.












Click it and Unblock the Notifications