భారత పర్యటనకు బ్రిటన్ ప్రధాని: అప్పుడు రద్దు..ఇప్పుడు మళ్లీ: షెడ్యూల్ ఫిక్స్
న్యూఢిల్లీ: బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్.. త్వరలో భారత పర్యటనకు రానున్నారు. వచ్చేనెల చివరి వారంలో ఆయన భారత్లో పర్యటిస్తారని యూకే ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది. ఆయన పర్యటన తేదీలు ఇంకా ఖరారు చేయాల్సి ఉందని తెలిపింది. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగిన తరువాత.. ఆ దేశ ప్రధాని నిర్వహించే తొలి అంతర్జాతీయ పర్యటనగా దీన్ని భావిస్తున్నారు. భారత్-బ్రిటన్ మధ్య ఆర్థిక, వాణిజ్య, దౌత్య సంబంధాలను బలోపేతం చేసుకునే దిశగా ఆయన పర్యటన ఉంటుందని తెలుస్తోంది.
అది భారత అంతర్గత విషయం: మాకు సంబంధం లేదు: హద్దులు దాటితే: తేల్చేసిన బ్రిటన్
నిజానికి- బోరిస్ జాన్సన్ ఇప్పటికే భారత పర్యటనకు రావాల్సి ఉండగా.. అది రద్దయిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం గణతంత్ర దినోత్సవ వేడులకు ఆయనను ముఖ్యఅతిథిగా ఆహ్వానించింది. బ్రిటన్లో కరోనా వైరస్ కొత్తరకం వేరియంట్ పుట్టుకుని రావడం, అనూహ్యంగా విస్తరించడం వంటి పరిణామాల మధ్య ఆయన భారత్కు రాలేకపోయారు. తాజాగా- బోరిస్ జాన్సన్ భారత్లో పర్యటిస్తారని ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది. ఏప్రిల్ చివరి వారంలో ఆయన పర్యటన ఉంటుందని తెలిపింది.
జూన్లో ఏడు ధనిక దేశాధినేతలు, ప్రధానమంత్రుల అంతర్జాతీయ స్థాయి అత్యున్నత సమావేశానికి బ్రిటన్ ఆతిథ్యమివ్వబోతోంది. ఈ నేపథ్యంలో బోరిస్ జాన్సన్ భారత పర్యటనకు రానున్నారనే అంచనాలు ఉన్నాయి. ఈ సమావేశానికి ప్రత్యేక సందర్శకునిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఆహ్వానిస్తారని చెబుతున్నారు. బోరిస్ జాన్సన్ భారత పర్యటన సందర్భంగా కొన్ని కీలక ఒప్పందాలపై రెండు దేశాల దౌత్యాధికారులు సంతకాలు చేసే అవకాశం ఉంది. కాంప్రహెన్సివ్ అండ్ ప్రోగ్రెసివ్ అగ్రిమెంట్ ఫర్ ట్రాన్స్-పసిఫిక్ పార్ట్నర్షిప్లో చేరాలంటూ కిందటి నెల బ్రిటన్ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. దీనిపై నరేంద్ర మోడీ సానుకూలత వ్యక్తం చేయొచ్చని అంటున్నారు.