నోట్ల రద్దుకు యువకుడు బలి: పరీక్ష ఫీజు కట్టలేక ఆత్మహత్య
మంగళవారం నాటికి కూడా డబ్బు చేతికి అందకపోవడంతో.. ఇక పరీక్ష రాయలేనన్న ఆందోళనతో బుధవారం నాడు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
లక్నో: నోట్ల రద్దు కారణంగా.. దేశవ్యాప్తంగా ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. క్యూ లైన్లలో నిలబడి కొంతమంది ప్రాణాలు కోల్పోతుండగా.. డబ్బు దొరకక, అవసరం తీరక.. తీవ్ర మనస్తాపంతో మరికొంతమంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
నోట్ల రద్దు ఎఫెక్ట్ తో ఉత్తరప్రదేశ్ లోని బాందా జిల్లాలో ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. బాందా జిల్లాలోని మావయి బుజుర్గ్ గ్రామానికి చెందిన సురేశ్(18) అనే యువకుడు పంచనేహి డిగ్రీ కాలేజీలో సైన్స్ విభాగంలో డిగ్రీ చేస్తున్నాడు. బుధవారం నాటికి కాలేజీలో అతడు పరీక్ష ఫీజు కట్టాల్సి ఉంది.

ఇందుకోసం ప్రతీ రోజు స్థానిక బ్యాంకు వద్దకు వెళ్లి గంటల తరబడి వేచియుండడం.. అయినా డబ్బు దొరికకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. మంగళవారం నాటికి కూడా డబ్బు చేతికి అందకపోవడంతో.. ఇక పరీక్ష రాయలేనన్న ఆందోళనతో బుధవారం నాడు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
సురేశ్ మరణానికి బ్యాంకుల తీరే కారణమంటూ.. అతని కుటుంబ సభ్యులు బ్యాంకుపై రాళ్లు రువ్వారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఎక్కడ చికిత్సకు డబ్బులు అందవేమోనన్న భయంతో ఉత్తరప్రదేశ్ లోని ఓ యువతి మొన్నీమధ్యే ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. మరో ఘటనలో అనారోగ్యంతో బాధపడుతున్న బాలిక సమయానికి చికిత్స అందించకపోవడతో.. బ్యాంకు ఎదుట క్యూ లైన్లోనే కన్నుమూసిన సంగతి కూడా తెలిసిందే.












Click it and Unblock the Notifications